న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ) మంగళవారం టోక్యో నుంచి ఢిల్లీ చేరుకుంది. కోచ్ పార్క్తో కలిసి ఆమె ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. ఆమెకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెడల్ గెలవడం సంతోషంగా ఉన్నదని, తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలని చెప్పింది. రియో గేమ్స్లో సిల్వర్ గెలిచి ఈసారి గోల్డే లక్ష్యంగా టోక్యో వెళ్లిన సింధు.. సెమీస్లో ఓడిన విషయం తెలిసిందే. అయితే బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో బింగ్జియావోపై గెలిచి ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచింది.