కోజీకోడ్: పరుగుల రాణి పీటీ ఉష గురువు ఓం నంబియార్ (89) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నంబియార్.. ఇంట్లోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య లీల, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పరుగులో ఓనమాలు నేర్పిన తొలి గురువు మృతిచెందడంతో పీటీ ఉషా భావోద్వేగానికి గురైంది. ‘నా గురువు, శిక్షకుడు, మార్గదర్శిని కోల్పోవడం తీరని లోటు. నా కెరీర్లో ఆయన ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది. మిమ్మల్ని మిస్సవుతున్నాం నంబియార్ సార్’ అని పీటీ ఉష ట్వీట్ చేసింది. ద్రోణాచార్య, పద్మశ్రీ అవార్డులు పొందిన నంబియర్ మృతి పట్ల ఏఎఫ్ఐ సంతాపం వ్యక్తం చేసింది.