హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి ఆరుగురు సభ్యులను హెచ్సీఏలో నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది.
దీనిలో భాగంగానే పలు కొత్త జిల్లాలకు సంఘంలో సభ్యత్వం కల్పించారు. జిల్లా కోటాలో వాల శరత్ చంద్ర(మంచిర్యాల), మఠం భిక్షపతి(సంగారెడ్డి), బుద్దుల శ్రవన్ రెడ్డి(వికారాబాద్), దాదన్నగారి సందీప్ కుమార్(కామారెడ్డి), దావ సురేష్(జగిత్యాల), కల్కుంట్ల మల్లికార్జున్(సిద్దిపేట)లను హెచ్సీఏ ఏజీఎంలో సభ్యులుగా చేరుస్తున్నట్లు అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు.
వీరిని పలు జిల్లాల అడ్హక్ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నూతన అడ్హక్ కార్యదర్శులు, సొసైటీస్ చట్టం ప్రకారం సంబంధిత జిల్లా క్రికెట్ అసోసియేషన్లను, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించనున్నారని అసోసియేషన్ ప్రకటించింది. తద్వారా మారుమూల ప్రాంతాల యువతకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నైపుణ్యాలను పెంపొందించనున్నట్లు అజారుద్దీన్ తెలిపారు.