కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ విధించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులను అనుమతించేందుకు నిరాకరిస్తున్నాయి. గుజరాత్, ఢిల్లీ, గోవా, రాజస్థాన్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ అని వచ్చిన రిపోర్ట్ను చూపిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నది. విమానాలు, రైలు, బస్సు ప్రయాణికులకైనా ఈ నిబంధన వర్తిస్తుంది.
టీమ్ఇండియా ఓపెనర్ పృథ్వీ షా ఇ-పాస్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు మహారాష్ట్రలోని ఓ గ్రామానికి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. షా విహారయాత్ర కోసం గోవా వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే పాస్ తీసుకున్న తర్వాత అతను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ప్రయాణానికి పాస్ పొందడాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో పృథ్వీ తన స్వస్థలమైన ముంబైకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం లభించడంతో ఎంజాయ్ చేయడానికి గోవాకు వెళ్తున్నట్లు అతడు వెల్లడించాడు.