కొనసాగుతున్న లాక్డౌన్
మార్కెట్, దుకాణాల వద్ద తగ్గిన రద్దీ
పెరిగిన వ్యాపార వాణిజ్య లావాదేవీలు
రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఈ-పాస్లు ఉన్నవారికే అనుమతి
ఖమ్మం, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లాక్డౌన్ 20వ రోజు సంపూర్ణంగా కొనసాగింది. ప్రభుత్వం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వెసులుబాటు ఇవ్వడంతో వివిధ పనుల కోసం మార్కెట్, ఇతర పనులు చేసుకునేందుకు ప్రజలకు ఊరట లభించింది. తమకు కావాల్సిన పనులను ప్రణాళికా బద్ధంగా ముగించుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి చేరుకున్నారు. సడలింపు సమయాన్ని పెంచడంతో కూరగాయల మార్కెట్, రైతుబజార్, పాలకేంద్రాలు, నిత్యావసర దుకాణాల వద్ద రోజువారీగా ఉండే రద్దీ కొంత తగ్గింది. సడలింపు సమయం పెంచడంతో వస్త్రదుకాణాలు, రెడీమేడ్ షాపులు, ఫర్నిచర్ షాపులు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలు వినియోగదారులతో కళకళలాడాయి. వ్యాపార లావాదేవీలు తొలిరోజు పుంజుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా రహదారులపైకి వచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. 2 గంటల తర్వాత లాక్డౌన్ను కఠినంగా అమలు పర్చేందుకు వివిధ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హెలీప్యాడ్ను పరిశీలిస్తున్న అధికారులుల తనిఖీ చేపట్టారు. ఈ-పాస్ లేకుండా ఇతర రాష్ర్టాల నుంచి ఏ ఒక్క వాహనాన్ని అనుమతించలేదు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఖమ్మంలోని మయూరిసెంటర్, కిన్నెర జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
2గంటల తర్వాత సరైన కారణం లేకుండా వచ్చే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. కూరగాయల మార్కెట్లు, రైతుబజార్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి కొనసాగింది. కార్మికులు నాలుగు షిఫ్ట్లలో విధులకు హాజరయ్యారు. అదేవిధంగా కేటీపీఎస్, బీటీపీఎస్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. కార్మికులు విధులకు హాజరయ్యారు. భద్రాచలం రామాలయాన్ని అర్చకులు ఉదయం 10 గంటలకు మూసివేశారు. స్వామివారి సేవలను అంతరంగికంగా నిర్వహించారు. సారపాకలో ఐటీసీ కర్మాగారంలో కార్మికులు విధులు నిర్వహించారు. ఆసుపత్రులకు వెళ్లే వాహనాలను మాత్రం తగిన పత్రాలను పరిశీలించి అనుమతించారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు పది గంటల తర్వాత డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని ప్రధాన పట్టణాల సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి అవసరం లేని వాహనాలను రాకుండా నిరోధించారు.