స్కాట్లాండ్లో కంటి డాక్టర్గా పనిచేస్తున్నా.. యూకేలో సొంతంగా క్లినిక్ ఉంది.. నిన్ను పెండ్లి చేసుకుంటా.. ముందుగా మీకు విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ నమ్మించిన సైబర్నేరగాడు.. నగరానికి చెందిన ఓ మహిళకు రూ.9 లక్షలు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ మారేడ్పల్లికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. ఆమె ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ.. మరో వివాహం కోసం భారత్ మ్యాట్రిమోనిలో మార్చి 27న రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆమె ప్రొఫైల్ చూసిన సైబర్నేరగాడు.. డాక్టర్ భక్షి క్లిఫోర్డ్ అనే పేరుతో పెండ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చాడు. తన స్వస్థలం పంజాబ్ అని, అయితే ముందుగా యూకేలో ఉన్నానని, ప్రస్తుతం స్కాట్లాండ్లో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు. తనకు యూకేలో కూడా క్లినిక్ ఉన్నదని నమ్మించాడు. ఈ సందర్భంగా ఇద్దరు వాట్సాప్ నంబర్లు మార్చుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరు చాటింగ్ చేస్తూ పెండ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడారు.
అయితే.. మన పెండ్లికి ముందే మీకు విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ నమ్మించా డు. ఆభరణాలు, పౌండ్స్, డాలర్ల ఫొటోలను వాట్సాప్లో పంపించాడు. రెండు రోజుల తరువాత తాము ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్నేరగాళ్లు.. బాధితురాలికి ఫోన్ చేశారు. మీ పేరుతో విలువైన బహుమతులు వచ్చాయని.. వాటికి కస్టమ్స్ క్లియరెన్స్ లేద ని.. అయితే.. వాటికి క్లియరెన్స్ చేసుకొని తీసుకోవచ్చంటూ నమ్మించి.. దఫదఫాలుగా ఆమె నుంచి రూ.9 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆమె శనివారం సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని సీసీఎస్ సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది.