‘భారత మహిళా క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తాను. నాకు ప్రధాన కోచ్గా అవకాశమిచ్చిన సీఏసీ, బీసీసీఐకి కృతజ్ఞతలు’
-పొవార్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్కే మళ్లీ పగ్గాలు అందాయి. సరిగ్గా రెండేండ్ల తర్వాత జాతీయ సీనియర్ మహిళల జట్టు చీఫ్ కోచ్గా పొవార్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. మాజీ క్రికెటర్ మదన్లాల్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ) కుదించిన ఎనిమిది మంది అభిప్రాయాలు, భవిష్యత్ విజన్ను పరిశీలనలోకి తీసుకుని తుది నిర్ణయానికి వచ్చింది. దీంతో డబ్ల్యూవీ రామన్ స్థానంలో పొవార్ ప్రధాన్ కోచ్గా బాధ్యతలు అందుకోనున్నాడు. మహిళల జట్టు చీఫ్ కోచ్ పదవి కోసం మొత్తం 35 మంది పోటీపడ్డారు. ఇందులో పలువురు మాజీ మహిళా క్రికెటర్లతో పాటు చీఫ్ సెలెక్టర్ హేమలత కళ ఉన్నారు. అయితే ఇంటర్యూ సందర్భంగా పొవార్ విజన్ సీఏసీ సభ్యులను ఆకట్టుకుంది. పొవార్తో పాటు పోటీలో ఉన్న మిగతా ఏడుగురు వారి వారి అభిప్రాయాలను పంచుకున్నా..సీఏసీని మెప్పించలేకపోయారు. పొవార్ ఎంపికపై మదన్లాల్ స్పందిస్తూ ‘జట్టు భవిష్యత్పై పొవార్కు కచ్చితమైన విజన్ ఉంది. జట్టును మరోస్థాయికి తీసుకెళ్లే విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నాడు. ముఖ్యంగా ఆటను అభివృద్ధి చేసే విషయంలో అన్నింటిపై పొవార్కు మంచి పట్టు ఉంది. వీటిని అతను అమలు చేసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. మిథాలీ వివాదంపై రమేశ్ను ప్రశ్నించగా తప్పేమి లేదని సమాధానమిచ్చాడు. జట్టులో అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. మరోవైపు నలుగురు మహిళల క్రికెటర్ల విజన్ కూడా మమ్మల్ని ఆకట్టుకుంది. ఆటతో వారు ఎలా మమేకమవుతున్నారో అర్థమైంది. వారికి భవిష్యత్ చాలా బాగుంటుంది’ అని అన్నాడు.
రెండేండ్ల క్రితం మహిళల జట్టు చీఫ్ కోచ్గా బాధ్యతలు అందుకున్న 42 ఏండ్ల రమేశ్ పొవార్ ఎక్కువ రోజుల నిలదొక్కుకోలేకపోయాడు. 2018లో జరిగిన టీ20 ప్రపంచకప్ పొవార్ ఉద్వాసనకు ప్రధాన కారణమైంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీని తప్పించడం వెనుక కోచ్ పొవార్ కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే జట్టులో జరుగుతున్న దానిపై బీసీసీఐకి మిథాలీ లేఖ రాసింది. ముఖ్యంగా పొవార్ వ్యవహార శైలిపై మిథాలీ ఘాటుగా స్పందించింది. జట్టులో తనను అవమానపరిచే రీతిలో పొవార్ వ్యవహరిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. దీనికి పొవార్ కూడా అంతే దీటుగా సమాధానమిచ్చాడు. జట్టులో సభ్యుల మధ్య కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతూ గందరగోళం సృష్టించేందుకు మిథాలీ ప్రయత్నిస్తున్నదని పొవార్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్గా మిథాలీ మాటకు గౌరవమిచ్చిన బీసీసీఐ..పొవార్ను చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పించింది. ఇదిలా ఉంటే..పొవార్ కోచ్గా ఉన్న స్వల్ప సమయంలోనే జట్టుకు మెరుగైన విజయాలందించాడు. టీ20 ప్రపంచకప్లో భారత్ను సెమీఫైనల్స్ చేర్చడంతో పాటు వరుసగా 14 టీ20 మ్యాచ్ల్లో గెలిచేలా చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. మహిళల జట్టుకు కోచ్గా వైదొలిగిన తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఈ ఏడాది ముంబైని విజేతగా నిలిపి తానేంటో నిరూపించుకున్నాడు. దీనికి తోడు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బౌలింగ్ కోచ్గా విధులు నిర్వర్తించాడు.
మహిళల జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్ పలు తప్పిదాలు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో పాటు ఇటీవల స్వదేశంలో వన్డేలు, టీ20 సిరీస్లను దక్షిణాఫ్రికాకు చేజార్చుకోవడం రామన్ తిరిగి కోచ్గా ఎంపికయ్యేందుకు గల అవకాశాలను దెబ్బతీసింది. దీనికి తోడు జట్టులో పలు మార్పులు చేయడం రామన్ పనితనంపై ప్రభావం చూపింది. యువ సంచలనం షెఫాలీ వర్మ, సీనియర్ శిఖా పాండే జట్టును తప్పించి రామన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
మహిళల జట్టు చీఫ్ కోచ్గా రమేశ్ పొవార్ ముందు సవాళ్లు ఉన్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియాను సిద్ధం చేయడం చాలా కీలకమైంది. దీంతో పాటు ఏడేండ్ల తర్వాత వచ్చే నెల 16 నుంచి ఇంగ్లండ్తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. కొవిడ్-19 విజృంభణ తర్వాత టీమ్ఇండియా మొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. కివీస్లో ప్రపంచకప్ కంటే ముందు ఆస్ట్రేలియాలో టీమ్ఇండియా పర్యటించనుంది.