పెద్దపల్లి, మార్చి 26(నమస్తే తెలంగాణ)/మంథని రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐ చోరీ కేసు ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది. ఏ ఒక్క ఆధారం దొరకకుండా పక్కా స్కెచ్తో అత్యంత తెలివిగా 18.46లక్షల నగదుతోపాటు 2.90కోట్ల విలువైన 6 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లడం ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెస్తున్నది. ఈ ఘటన పక్కా ప్రొఫెషనల్స్ చేసినట్లు తెలుస్తుండగా, పోలీస్ శాఖ కూడా ఇదే చె బుతున్నది. ఇప్పటికే ఎనిమిది బృందాలను రం గంలోకి దించి, దర్యాప్తును వేగవంతం చేసింది.
సీసీ కెమెరాలకు చిక్కకుండా మరో మార్గం
గుంజపడుగు గ్రామంలో మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ఎస్బీఐ ఉన్నది. 2002 నుంచి ఇక్కడే కొనసాగుతున్నది. అయితే చోరీ గ్యాంగ్ మంథని నుంచి గ్రామంలోని బ్యాంకుకు వస్తే ప్రధాన రహదారి జడ్పీ హైస్కూల్ వద్ద, గోదావరిఖని వైపు నుంచి వస్తే గుంజపడుగు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు మార్గాల్లో కాకుండా.. తెలివిగా బ్యాంకు వెనుకవైపు హనుమాన్నగర్ గడ్డమీది ఇండ్ల వైపు నుంచి చెరువు గట్టు మీదుగా చేరుకున్నట్లు తెలుస్తున్నది. చోరీ చేసిన విధానాన్ని పరిశీలిస్తే నిందితులు తప్పనిసరిగా ఒకటి లేదా రెండు వాహనాలను వెంట తెచ్చుకొని ఉండే అవకాశమున్నది. ఎందుకంటే వారు ఉపయోగించిన బరువైన ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్తోపాటు కార్బైట్ లేదా వంట గ్యాస్ సిలిండర్లు తెచ్చినట్లు తెలుస్తుండగా, వాహనం లేనిది తీసుకురావడం సాధ్యపడదు. అంటే చెరువుగట్టుపై ఉన్న రహదారినైనా.. లేదంటే చెరువు గట్టు కింద ఉన్న రహదారినైనా ఉపయోగించి ఉంటారు. ఈ దారి గుండా బ్యాంకుకు చేరుకున్న నేపథ్యంలో వారు ఊరికి రెండు వైపులా ఉన్న సీసీ కెమెరాల్లో పడే అవకాశం ఉండదు. తిరిగి చోరీ అనంతరం కూడా వెనుకవైపు దారి నుంచి వెళ్లి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా ముందస్తుగా రెక్కీ, పక్కా ప్లాన్తోనే సాధ్యమ య్యే అవకాశాలుంటాయనే చర్చ జోరుగా నడుస్తున్నది. రాత్రి సమయంలోనో.. సాయంత్రం సమయంలోనో.. తమకు కావాల్సిన సామగ్రితో వాహనాల్లో చెరువు కట్టపైకో, కిందికో చేరుకొని ఉంటారు. వాటి సహాయంతోనే అర్ధరాత్రి పనిని ముగించి ఉంటారు. చోరీ తర్వాత పోలీసులు క్లూస్ టీం, డాగ్స్కాడ్ను రంగంలోకి దించగా, డాగ్ స్కాడ్ డాగ్ సైతం హనుమాన్నగర్ గడ్డమీది పల్లెవైపే పరుగులు పెట్టి ఆగింది.
కిటికీ ధ్వంసంపై ఎన్నో అనుమానాలు..
వెనుక వైపు నుంచి బ్యాంక్లోకి రావాలంటే ముందు వైపు తప్ప మరో మార్గమే లేదు. అయి తే బ్యాంకు వెనుకవైపు కనిపించకుండా లప్పం తో మూసి ఉన్న కిటికీని ధ్వంసం చేసి చోరీ గ్యాం గ్ లోపలికి ప్రవేశించడం, ఆ విషయం దొంగలకు ఎలా తెలిసిందనేది తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.
ఎక్స్పర్ట్స్తోనే సాధ్యం..
ఆక్సిజన్ సిలిండర్ను ఉపయోగించి ఇనుప వస్తువులు కట్ చేయాలంటే కార్బైడ్ లేదా ఎల్పీజీ గ్యాస్ అనుసంధానమైతేనే సాధ్యమవుతుంది. అయితే నిందితులు కార్బైట్ లేదా ఎల్పీజీ గ్యాస్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉపయోగించి ఉంటారని తెలుస్తున్నది. వీటి ఆధారంగానే కిటికీ ఇనుప చువ్వలు, బ్యాంక్ లాకర్ను కట్ చేసినట్లుగా విధితమవుతున్నది. పక్కా ప్రణాళికతో ముఠా బ్యాంకులోకి ప్రవేశించింది. అందు లో గ్యాస్ వెల్డింగ్, గ్యాస్ కటింగ్కు సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ వ్యక్తి తప్పకుండా ఉండి ఉండే అవకాశం ఉన్నది. ఇలాంటివి వాడాల న్నా.. గ్యాస్ కటింగ్ చేయాలన్నా గ్యాస్ వెల్డింగ్ పని వచ్చిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ముఠాలో ఈ వ్యక్తే కీలక పాత్ర పోషించి ఉంటాడు. అలాగే ఎలక్ట్రికల్పై పూర్తి అవగాహన ఉన్న మరో వ్యక్తి సాయంతోనే బ్యాంకులోని డే టా వీడియో రికార్డర్ బాక్సును, అలారం మోగకుండా.. సీసీ కెమెరాలు పనిచేయకుండా ముం దే కనెక్షన్ను కట్ చేయడం, బ్యాటరీలు తొలగించడం, హార్డ్వేర్ పరికరాలు పనిచేయకుండా చే యడం చూస్తే ముఠాలోని వారికి టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నది. వీరితోపాటు బయటా.. లోపలా గస్తీ కాసే వ్యక్తులుండే అవకాశమున్నది. చోరీ తర్వాత గ్యాస్ సిలిండర్ ను వదిలేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేదా కార్బై ట్ ట్యాంక్లను తిరిగి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.
సిలిండర్పై కోడ్ చెరిపివేత..
చోరీకి సంబంధించి గ్యాంగ్ ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నది. అయితే ఆక్సిజన్ సిలిండర్పై జిల్లా, రాష్ట్ర, డీలర్ కోడ్లను ముందస్తుగానే చెరిపివేసి బ్యాంక్లోకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తున్నది. ఈ సిలిండర్లను గ్యాస్ వెల్డింగ్తో పాటు దవాఖానల్లో రోగులకు ఆక్సిజన్ను అందించేందుకు ఉపయోగిస్తారు. ఈ సిలిండర్లను గ్యాస్ వెల్డింగ్, ఇతర వెల్డింగ్ షాపులు, దవాఖానలు, అంబులెన్స్లు, భారీ నిర్మాణాల్లోనూ వాడుతూ ఉంటారు. ఈ సిలిండర్లకు తప్పనిసరిగా ఎల్పీజీ గ్యాస్ను లేదా కార్బైడ్ ట్యాంక్ ద్వారా మాత్రమే గ్యాస్ కటింగ్కు ఉపయోగించే వీలుంటుంది. అయితే దొంగలు ఈ అత్యంత బరువైన సిలిండర్ తిరిగి తీసుకెళ్లకూడదని ముందుగానే నిర్ధారించుకున్నట్లు తెలుస్తున్నది. అందుకే ఆ సిలిండర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి పేరుపై ఉన్నది? ఏ జిల్లాకు సంబంధించింది? ఏ డీలర్కు సంబంధించింది? అనే వివరాలు తెలియకుండా బార్కోడ్ను చెరిపేసినట్లుగా అవగతమవుతున్నది.
ఖాతాదారుల్లో ఆందోళన..
నగదుతో పాటు భారీగా బంగారం చోరీ కావడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జమ చేసుకున్న డబ్బు, తాకట్టు పెట్టిన, లాకర్లో దాచిన బంగారం ఎలా వస్తాయోనని కలత చెందుతున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.