న్యూఢిల్లీ: హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ( PV Sindhu ) తో కలిసి ప్రధాని మోదీ ఐస్క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్లతో పాటు ఆ మహాక్రీడలకు వెళ్లిన బృందంతో ఇవాళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన నివాసంలో అథ్లెట్లకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలో స్టార్ షట్లర్ పీవీ సింధుతో కలిసి ప్రధాని మోదీ ఐస్క్రీమ్ తిన్నారు. టోక్యో గేమ్స్ వెళ్లే ముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో.. పతకంతో తిరిగి వచ్చాక ఐస్క్రీమ్ తిందామని సింధుతో మోదీ చెప్పిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే ఇవాళ మోదీ తన మాట నిలబెట్టుకున్నారు. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటకు కూడా అథ్లెట్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని తన ప్రసంగం వేళ అథ్లెట్లపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
ఇవాళ్టి సన్మాన కార్యక్రమంలో జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతోనూ మోదీ ఫోటో దిగారు. వారిద్దరూ పర్సనల్గా కాసేపు గడిపారు. తినకు చూర్మ వంటకం ఇష్టమని నీరజ్ చెప్పారు. ఆ డిష్ను ఈ కార్యక్రమం కోసం మోదీ చేయించారు. హైదరాబాదీ షట్లర్ పీవీ సింధుతోనూ మోదీ కాసేపు ముచ్చటించారు. టోక్యో బ్యాడ్మింటన్లో సింధు బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్కు సింధూ రియో పతకాన్ని కూడా తీసుకువచ్చింది. రెండు మెడల్స్ మెడలో వేసుకుని ప్రధాని మోదీతో సింధు ఫోటో దిగింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మొత్తం ఏడు మెడల్స్ వచ్చాయి. మెన్స్ హాకీ టీమ్తో పాటు నీరజ్ చోప్రా, సింధు, రవికుమార్ దహియా, భజరంగ్ పూనియా, మీరాబాయి ఛాను, లవ్లీనా బోర్గోహైన్ పతకాలు గెలిచారు.