న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో రాణించి నవ భారత నినాదాన్ని చాటాలని అథ్లెట్లకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిశానిర్దేశం చేశారు. అంచనాల ఒత్తిడిని పట్టించుకోకుండా అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి సారించాలని సూచించారు. ఒలింపిక్స్లో బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లతో మోదీ మంగళవారం ఆన్లైన్ సమావేశం ద్వారా మాట్లాడారు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, ద్యుతీచంద్, నీరజ్ చోప్రా, దీపికా కుమారి, వినేశ్ ఫోగట్, సౌరభ్ చౌదరి, ఎలావెనిల్ వలరివన్, శరత్ కమల్ సహా మరికొందరు అథ్లెట్లు ఈ వర్చువల్ చర్చలో పాల్గొన్నారు. విశ్వక్రీడలకు సన్నద్ధత, లక్ష్యాలు తదితర అంశాలను అథ్లెట్ల నుంచి మోదీ తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడాశాఖ నూతన మంత్రి అనురాగ్ ఠాకూర్, గత క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, ఐవోఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు షట్లర్ పీవీ సింధుతో మోదీ సరదాగా మాట్లాడారు. 2016 రియో ఒలింపిక్స్లో ఐస్క్రీమ్లకు సింధు దూరంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘రియో ఒలింపిక్స్లో ఐస్క్రీమ్లపై ఆంక్షలు ఉండేవి. టోక్యో కోసం కొత్తగా ఏవైనా నిబంధనలు విధించారా’ అని సింధును మోదీ సరదాగా అడిగారు. ‘సర్, నేను డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటా. పోటీలు ఉన్నప్పుడు ఐస్క్రీమ్లు ఎక్కువగా తినను’ అని సింధు నవ్వుతూ చెప్పింది. ‘ఒకవేళ టోక్యో నుంచి తిరిగి వచ్చాక మిమ్మల్ని కలిస్తే మీతో కలిసి ఐస్క్రీమ్ తింటా’ అని మోదీ అన్నారు. రియో ఒలింపిక్స్ సమయంలో ఐస్క్రీమ్లు తినకూడదని, సెల్ఫోన్కు దూరంగా ఉండాలని సింధుకు కోచ్ గోపీచంద్ ఆంక్షలు విధించారు.