న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ వెళ్తున్న భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్గా మాట్లాడారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారాయన. ఈ నేపథ్యంలో మేటి బాక్సర్ మేరీకోమ్తోనూ మాట్లాడారు. తన ఫెవరేట్ పంచ్ ఏంటని ఆయన అడిగారు. నువ్వు విసిరే ప్రతి పంచ్లో నువ్వే చాంపియన్.. మరి నీ ఫెవరేట్ పంచ్ ఏంటని.. జామ్, హుక్, అప్పర్ కట్, ఏదో చెప్పాలని మోదీ కోరారు. బాక్సర్ మేరీ కోమ్ ఆ ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఎక్కువ ఎడమ చేతితో డిఫెండ్ చేస్తాను కాబట్టి.. తనకు హుక్ పంచ్ ఫెవరేట్ అన్నట్లు చెప్పింది. ఇది చాలా శక్తివంతమైన పంచ్ అని, ఎందుకంటే దాని నుంచి ప్రత్యర్థులు తప్పించుకునే వీలులేదని చెప్పిందామె.
ఇక నీ ఫెవరేట్ అథ్లెట్ ఎవరని మోదీ అడగ్గా.. దానికి మేరీకోమ్ బదులిస్తూ.. బాక్సింగ్లో తనకు హీరో, ప్రేరణ.. లెజండరీ మొహమ్మద్ అలీ అని ఆమె పేర్కొన్నది. బాక్సింగ్ కెరీర్ను ఎంపిక చేసేందుకు అలీ తనకు ప్రేరణగా నిలిచినట్లు మేరీకోమ్ తెలిపింది. ప్రపంచంలో దాదాపు చాలా వరకు బాక్సింగ్ టోర్నీలను మీరు గెలిచారని, ఒలింపిక్లో గోల్డ్ గెలవడం లక్ష్యమని మీరన్నారని, ఇది మీ స్వప్నమే కాదు, ఇది దేశం మొత్తం ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. నీ ఆశయాలను, ప్రజల ఆశయాలను తీరుస్తావని దేశం భావిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
2012 లండన్ ఒలింపిక్స్లో మేరీకోమ్.. కాంస్య పతకాన్ని గెలుచుకున్నది. అయితే టోక్యో ఒలింపిక్స్ ఆమెకు చివరి అవకాశం. ఈ క్రీడల్లో రాణించాలని ఆమె భావిస్తున్నది. ఒలింపిక్స్ బాక్సింగ్ క్యాటగిరీలో మెడల్ గెలిచిన తొలి భారతీయురాలిగా మేరీకోమ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. టోక్యో క్రీడలకు మేరీకోమ్తో పాటు మరో 8 మంది బాక్సర్లు వెళ్తున్నారు.