ముంబై : విశాఖ ఉక్కు సహా పీఎస్యూల అమ్మకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు పెడుతుందని బిగ్బుల్ రాకేష్ జంఝన్వాలా చెప్పుకొచ్చారు. దేశం రెండంకెల వృద్ధి రేటు సాధించాలంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించక తప్పదని స్పష్టం చేశారు. జన్థన్ ఖాతాలు, డిజిటలీకరణతో ప్రభుత్వాలు సులభతర వాణిజ్యానికి బాటలు వేశాయని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా రెండో దశ సంస్కరణలపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని రాకేష్ జంఝన్వాలా పేర్కొన్నారు.
మనం రెండంకెల వృద్ధి సాధించాలంటే పీఎస్యూల ప్రైవేటీకరణ అనివార్యమని ఓ జాతీయ వార్తా ఛానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. పీఎస్యూల్లో ప్రభుత్వ వాటా ఉపసంహరణ సమయంలో ఆయా వాటాలను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు కంపెనీలు కోలుకుని సత్తా చాటేవరకూ కనీసం మూడు నాలుగేండ్లు వేచిచూడాలని సూచించారు. 2003 నుంచి 2008 మధ్య ప్రభుత్వ రంగం మెరుగైన సామర్థ్యం కనబరిచినా ఇటీవల కాలంలో పేలవమైన సామర్ధ్యం కనబరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లపై తాను సానుకూల దృక్పథంతో ఉన్నాయని, అవి రాబోయే రోజుల్లో భారీగా లాభపడతాయని విశ్లేషించారు. రాబోయే ఐదు నుంచి పదేండ్లలో కొన్ని పీఎస్యూ బ్యాంకుల షేర్లు కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.