ధాన్యాన్ని తరలించడానికి ట్రాక్టర్లను అనుమతించాలి
రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
బొంరాస్పేట/కొడంగల్, మే 18: కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావడానికి, తూకం వేయడానికి గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం బొంరాస్పేట, కొడంగల్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. బొంరాస్పేట కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగుల కొరత కారణంగా రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, తూకం చేసిన ధాన్యం మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతున్నదని రైతులు, కేంద్రం నిర్వాహకులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే ఎమ్మెల్యే, కలెక్టర్తో మాట్లాడి నియోజకవర్గంలోని మూడు మండలాలకు అవసరమైన గన్నీ బ్యాగులను అందించాలని కోరారు. అవసరమైతే పౌరసరఫరాల సంస్థ చైర్మన్తో మాట్లాడుతానన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతున్నదని, కొనుగోళ్లు లేక రైతులు తెచ్చిన ధాన్యం ఆరుబయటే నిల్వ చేసుకున్నారని, వర్షం వస్తే తడిసిపోతున్నదని ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీలతో పాటు ట్రాక్టర్లను అనుమతించాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మండలానికి ఇంతవరకు ఎన్ని బ్యాగులు వచ్చాయని ఏవో రాజేశ్కుమార్ను అడిగారు. మండలానికి 5.10 లక్షల గన్నీ బ్యాగులు అవసరముండగా ఇప్పటివరకు లక్ష వచ్చాయని ఏవో తెలిపారు.
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కొడంగల్లోని ప్రభుత్వ దవాఖానను ఆయన పరిశీలించారు. రోజూ ఎంతమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని వైద్యాధికారి రవీంద్ర యాదవ్ను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి మందుల కిట్లు అందజేయాలని, హోం ఐసొలేషన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మూడు రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని వైద్యాధికారి తెలిపారు. పీహెచ్సీలోని ఆపరేషన్ థియేటర్, బెడ్లు, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట అదనపు కలెక్టర్ మోతీలాల్, కొడంగల్ డీటీ ఆనంద్, బొంరాస్పేట, కొడంగల్ పీఏసీఎస్ చైర్మన్లు విష్ణువర్ధన్రెడ్డి, శివకుమార్, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, మండల యూత్ అధ్యక్షుడు మహేందర్, నాయకులు దేశ్యానాయక్, టీటీ రాములు, చాంద్పాషా పాల్గొన్నారు.