సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: శాసనమండలి విప్, ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్రావు తండ్రి తానిపర్తి ప్రభాకర్రావు (82) ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో మరణించారు. పెద్దపల్లి జిల్లా లోకపేట గ్రామానికి చెందిన ప్రభాకర్రావు అటవీశాఖలో కన్జర్వేటర్గా కరీంనగర్, జన్నారం, మెదక్ డివిజన్లలో పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్లో స్థిరపడ్డారు. కరోనా వచ్చి పరిస్థితి విషమించడంతో ఐదురోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భానుప్రసాదరావుతోపాటు మరో కుమారుడు ప్రశాంత్రావు, భార్య ప్రేమలత ఉన్నారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రభాకర్రావు మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీఆర్, కొప్పుల, ఈటల, గంగుల, ఎర్రబెల్లి, ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తదితరులు ప్రభాకర్రావు మృతికి సంతాపం ప్రకటించారు. ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, నారదాసు లక్ష్మణ్రావు, భూపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, సంజయ్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తదితరులు భానూప్రసాదరావుకు ఫోన్చేసి ఓదార్చారు.