కవాడిగూడ/ కాజీపేట, మార్చి 24 : వరంగల్ మహానగరానికి కోచ్ ఫ్యాక్టరీ అవసరం ఎంతగానో ఉన్నదని, అది ఇక్కడి ప్రజల దశాబ్దాల కల అని, ఇప్పటికైనా కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం చేపడుతామని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్లో ‘కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ పోరాట సమితి’ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బుల్లెట్ రైళ్లు వస్తున్న ప్రస్తుత తరుణంలో కోచ్ ఫ్యాక్టరీ అవసరాన్ని గుర్తించి వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదని, ఈ అంశాన్ని తాను పార్లమెంట్లో ఇదివరకే లేవనెత్తానని, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కూడా అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడుతారని చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, సానుకూలంగా లేకుంటే మరో ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
వరంగల్ నుంచి భారీగా తరలిన నేతలు
మహా నిరసన దీక్షకు మద్దతుగా కాజీపేట నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేశ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యు డు సుంచు కృష్ణ మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభు త్వం ఇప్పడు అవసరం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ, డివిజన్ ఏర్పాటయ్యేదాకా ఉద్యమిస్తామన్నారు. తరలివెళ్లిన వారిలో కాటాపురం రాజు, అయ్యాల దానం, తేలు సారంగపాణి, శిరుమల్ల దశరథం, పాలగుడుల శివకుమార్, మర్యాల కృష్ణ, సుంచు అశోక్, సంకు నర్సింగ్, దువ్వ కనుకరాజు, నయీం జుబేర్, నరేశ్, తండమల్ల వేణు, సయ్యద్ సర్వర్, కొండ్ర శంకర్, పాము రాజేశ్, నజీరుద్దీన్, మల్లేశ్, మండల సుబ్బు, వెనిశెట్టి వేణు, సుంచు రఘురాం, ఫర్హాన్ తదితరులున్నారు.
ఇది ప్రజా ఉద్యమంగా
మారాలి : దాస్యం
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన అనేది ప్రజా ఉద్యమంగా మారాలని అభిప్రాయపడ్డారు. గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఒక సైనికుడిగా ముందుకొస్తానన్నారు. పార్టీ ఆదేశం మేరకే దీక్షలో పాల్గొన్నానని చెప్పారు. కాజీపేటను డివిజన్గా తీర్చిదిద్దే బాధ్య త కేంద్రంపైనే ఉందన్నారు. కోచ్ఫ్యాక్టరీ కోసం ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసేలా కృషిచేస్తానని చెప్పారు.
పోరాటం ఉధృతం : చాడ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కాజీపైటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మెడలు వంచేలా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కోచ్ఫ్యాక్టరీ అంశం రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగమేనని గుర్తు చేశారు. ఫ్యాక్టరీని సాధించేదాకా పోరాటాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. పోరాట సమితి అధ్యక్షుడు గాదె ఇన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, టీపీసీసీ సభ్యురాలు రవళి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.