న్యూఢిల్లీ: చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది ప్రొ కబడ్డీ లీగ్ (PKL 2021). క్రికెట్ మేనియాలో ఉన్న భారత అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచింది ఈ లీగ్. పనిలో పనిగా కొందరు స్టార్ కబడ్డీ ప్లేయర్స్ను కోటీశ్వరులనూ చేసింది. అలాంటి ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్ డిసెంబర్ 22 నుంచి మళ్లీ ఫ్యాన్స్ను అలరించనున్నట్లు ఈ లీగ్ ఆర్గనైజర్ మాషల్ స్పోర్ట్స్ మంగళవారం తెలిపింది.
నిజానికి ఈ సీజన్ 2020లోనే జరగాల్సి ఉన్నా.. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ లీగ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్స్టార్లు లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఈ సీజన్ 8 మొత్తం కర్ణాటక రాజధాని బెంగళూరులోనే జరగనున్నట్లు మాషల్ స్పోర్ట్స్ సీఈవో అనుపమ్ గోస్వామి తెలిపారు. ఈ సీజన్ బయో బబుల్లో జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్లో పీకేఎల్ ప్లేయర్స్ వేలం జరిగింది.
మొత్తం 59 ప్లేయర్స్ను ఆయా ఫ్రాంచైజీలు రిటేన్ చేసుకున్నాయి. 450 మంది ప్లేయర్స్ వేలంలో పాల్గొన్నారు. వీళ్లలో 190 మంది ప్లేయర్స్ను టీమ్స్ కొనుగోలు చేశాయి. మొత్తం రూ.48.22 కోట్లు వెచ్చించారు. అత్యధికంగా స్టార్ ప్లేయర్ పర్దీప్ నర్వాల్ను రూ.1.65 కోట్లు పెట్టి యూపీ యోధా సొంతం చేసుకుంది. ఇక మరో స్టార్ సిద్దార్థ్ దేశాయ్ను తెలుగు టైటాన్స్ టీమ్ రూ.1.3 కోట్ల రిటేన్ చేసుకుంది. పీకేఎల్ డిఫెండింగ్ చాంపియన్స్గా బెంగాల్ వారియర్స్ ఉన్నారు.