మంగళవారం రాత్రి భారీగాలులు, ఉరుములతో వాన
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పంటకు దెబ్బ
హుజూరాబాద్, ఏప్రిల్ 14:అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మంగళవారం అర్ధరాత్రి భారీ గాలులు, ఉరుములతో కూడిన వాన దంచికొట్టగా, హుజూరాబాద్ నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మక్క నేలకొరుగగా, పలుచోట్ల కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. మక్క, మిర్చి దెబ్బతినగా, కర్షకుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కర్షకుడి నెత్తిపై అకాల పిడుగు పడింది. పంట చేతికచ్చే టైంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తీరని నష్టం జరిగింది. పలుచోట్ల కోతలకు సిద్ధంగా ఉన్న వరి నేలకొరుగగా, కేంద్రాలకు తరలించిన ధాన్యమూ తడిసిపోయింది. ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలలో మక్క, మిర్చికి నష్టం ఎక్కువగా జరిగింది. కల్లాల మీద ఉన్న మిరపవరుగు తడిసి పోగా, రంగు మారి ధర తక్కువగా పలుకుతుందని రైతులు వాపోయారు. వరి పైరు తడిసి నేలకొరుగడంతో కోతలకు మూడు నాలుగు రోజులు బ్రేక్ పడనున్నది. ఇక హుజూరాబాద్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించగా, ధర్మరాజుపల్లిలో తాటి చెట్టు విరిగిపడి రైతు గాజే రవికి చెందిన గేదే మృత్యువాత పడింది. సింగాపూర్లో బుర్ర సురేందర్ గౌడ్కు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. ఇల్లందకుంట మండలం టేకుర్తి, చిన్నకోమటిపల్లి, ఇల్లందకుంట, రాచపల్లి, సీతంపేటలో మక్కజొన్న, వరి దెబ్బతిన్నాయి. జమ్మికుంట మండలంలోని మడిపల్లిలో మహమ్మద్ అంకూస్కు చెందిన నాటుకోళ్ల ఫాంలోకి వర్షపు నీరు చేరి కోళ్లు మృతిచెందాయి. అలాగే అతని ఎకరా మక్క పూర్తిగా దెబ్బతిన్నది. మొత్తంగా 3లక్షల నష్టం జరిగిందని, తనను ఆదుకోవాలని అంకూస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
ఇక శంకరపట్నం మండలం లింగాపూర్, ఆముదాలపల్లి, మొలంగూర్, మెట్పల్లి, కేశవపట్నం తదితర గ్రామాలలో వర్షం కురిసింది. ఈదురు గాలులకు లింగాపూర్లో 20 మంది రైతులకు చెందిన దాదాపు 40 ఎకరాలలో వరి పైరు నేలకొరిగింది. అంతం రాజిరెడ్డి, గొల్లిపెల్లి శ్రీనివాస్, పచ్చిమట్ల నారాయణ, అంతం సతీష్రెడ్డి, అంతం తిరుపతిరెడ్డి, అంతం జగ్గారెడ్డి, తడిసిన నారాయణరెడ్డి, తదితరులకు చెందిన వరి పైరు భారీగా దెబ్బతింది. అలాగే ఆముదాలపల్లిలో దాదాపు 500 ఎకరాలలో హైబ్రీడ్ సీడ్ వరి గింజ నేల రాలినట్లు రైతులు వాపోయారు. కనవేని జంపయ్య, కలువల రవి, అనుకూరి కొమురారెడ్డి, రాజేంద్రప్రసాద్, అనుకూరి సత్తిరెడ్డి, మల్లారెడ్డి, ముత్తారెడ్డి, తదితర రైతుల ధాన్యం నేల రాలింది. కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లెలో అంబీర్ శంకర్ మక్క పూర్తిగా నేలకొరగగా, పెద్దరాత్పల్లిలో పలువురు రైతుల మక్క జొన్న పంటలు నేలవాలినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. అక్కడక్కడా మొదటి దఫా కోతకు వచ్చిన వరి పంట, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు తడిసాయి. కాగా, హుజూరాబాద్ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, మార్కెట్ చైర్పర్సన్ బర్మావత్ రమ, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ పరిశీలించారు. వారివెంట వైస్చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, తహసీల్దార్ బాహుసింగ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణీ, నాయకులు గందె శ్రీనివాస్ తదితరులున్నారు.