న్యూఢిల్లీ : ట్విట్టర్ ఇండియా చీఫ్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే యూపీలో దాడి ఘటన విషయంలో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీలో ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. తాజాగా భారత్లో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా చూపించడంపై చేసిన ఫిర్యాదు మేరకు మరోసారి ఎఫ్ఐఆర్ నమోదైంది. భారత మ్యాప్ను వక్రీకరించి చూపించిన ట్విట్టర్.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో దాన్ని తొలగించింది. ట్విట్టర్తన వెబ్సైట్లో భారత్లో అంతర్భాగమైన జమ్ముకాశ్మీర్, లద్దాఖ్ను ప్రత్యేక దేశంగా చూపించింది.
‘ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని, దీనిపై రాజద్రోహం కింద చర్యలు తీసుకోవాలి’ అంటూ భజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి బులందర్షహర్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 505(2), ఐటీ సవరణ చట్టం 2008లోని సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. ఇందులో ట్విట్టర్ ఇండియా న్యూస్ పార్ట్నర్షిప్ హెడ్ అమృతా త్రిపాఠి పేరు సైతం ఉంది.
గత వారం ఉత్తర్ప్రశ్కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్ను ఉపయోగించుకున్నారని తెలిపారు. కేసుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే.. ఈ కేసులో యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును మనీశ్ మహేశ్వరి ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.