వరంగల్, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రైల్వేస్ స్ప్రింటర్ పారుల్ చౌదరి పతక జోరు కొనసాగుతున్నది. వరంగల్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఇప్పటికే 5వేల మీటర్ల రేసులో పసిడి పతకంతో మెరిసిన పారుల్.. తాజాగా 3000 మీటర్ల స్టిపుల్చేజ్లోనూ సత్తాచాటింది. శుక్రవారం జరిగిన రేసులో ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ ముందుకు సాగిన పారుల్ 9:51:01 టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకంతో మెరిసింది. ఇదే రేసులో పోటీపడ్డ కోమల్ (9:51:03), ప్రీతి (10:22:45) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పురుషుల 35కి.మీ రేస్ వాక్లో ఉత్తరప్రదేశ్ అథ్లెట్ రామ్బాబు (2:46:31) సరికొత్త జాతీయ రికార్డుతో స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. ఆది నుంచే దూకుడు కనబరిచిన రామ్బాబు చిరుతను తలపిస్తూ అందరికంటే ముందంజలో నిలిచాడు. ఇక మహిళల లాంగ్జంప్లో రైల్వేస్ ప్లేయర్ ఐశ్వర్య 6.52 మీటర్లు లంఘించి దూకి పసిడిని ముద్దాడింది. ఈ సీజన్లో ఐశ్వర్య తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. ఇదే విభాగంలో షెరిన్ (6.27మీ), ప్రియాంక (6.05మీ) రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. మిగతా పోటీల్లో శంకర్లాల్ (3000 స్టిపుల్చేజ్), తేజస్ అశోక్ (110మీ హర్డిల్స్), కనిమొళి (100మీ హర్డిల్స్), రమణ్దీప్కౌర్ (35కి.మీ రేస్వాక్) స్వర్ణ పతకాలు చేజిక్కించుకున్నారు.