పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. టోక్యో విశ్వక్రీడలకు ముందు వరకు జరిగిన పారాలింపిక్స్ క్రీడలన్నింటిలో కలిపి 12 పతకాలే నెగ్గిన మనవాళ్లు.. తాజా క్రీడల్లోనే ఆ సంఖ్యను దాటి 17 పతకాలు కొల్లగొట్టారు. టోక్యో పారాలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్లో ప్రమోద్ భగత్ స్వర్ణం నెగ్గగా.. షూటింగ్లో మనీశ్ నర్వాల్ పసిడి కాంతులు విరజిమ్మాడు. ఇప్పటికే ఓ కాంస్యం నెగ్గిన షూటర్ సింగ్రాజ్ ఈసారి రజతం పడితే..
టోక్యో: పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతున్నది. శుక్రవారం మూడు పతకాలతో తీన్మార్ ఆడిన మనవాళ్లు.. శనివారం మరో నాలుగు మెడల్స్ ఖాతాలో వేసుకున్నారు. తద్వారా టోక్యో క్రీడల్లో ఓవరాల్గా భారత్ 17 పతకాల (4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలు)తో పట్టికలో 26వ స్థానానికి ఎగబాకింది. విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన బ్యాడ్మింటన్లో స్వర్ణం నెగ్గి ప్రమోద్ భగత్ నయా చరిత్ర లిఖిస్తే.. షూటింగ్లో మనీశ్ నర్వాల్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ప్రమోద్ 21-14, 21-17తో రెండో సీడ్ డానియల్ బెతెల్ (బ్రిటన్)పై విజయం సాధించాడు.
45 నిమిషాల పాటు సాగిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన ప్రమోద్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నా కల నిజమైనట్లు అనిపిస్తున్నది. స్వర్ణ పతకంతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు ఆనందంగా ఉంది’అని అన్నాడు. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారత షట్లర్ మనోజ్ సర్కార్ కాంస్యం గెలుచుకున్నాడు. ప్లే ఆఫ్ మ్యాచ్లో మనోజ్ 22-20, 21-13తో ఫుజిహరా (జపాన్)పై విజయం సాధించాడు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఎస్హెచ్1 విభాగంలో 19 ఏండ్ల మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లతో పసిడి పతకం కొల్లగొడితే.. ఇదే విభాగంలో మరో భారత షూటర్ సింగ్రాజ్ అదానా 216.7 పాయింట్లతో రజత పతకం చేజిక్కించుకున్నాడు. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం గెలుచుకున్న సింగ్రాజ్కు తాజా క్రీడల్లో ఇది రెండో పతకం కావడం విశేషం. పారాలింపిక్స్లో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు అభినందించారు. టోక్యో క్రీడల్లో ఇప్పటికే 17 పతకాలు నెగ్గిన భారత అథ్లెట్లు.. ఆదివారం మరో నాలుగు పతకాల కోసం పోటీ పడనున్నారు.
విశ్వక్రీడల్లో మనదేశం తరఫున స్వర్ణం సాధించిన తొలి మహిళా అథ్లెట్గా రికార్డు సృష్టించిన అవని.. టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఆదివారం జరుగనున్న కార్యక్రమంలో అవని త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందు నడవనుండగా.. భారత్ నుంచి 11 మంది ఇందులో పాల్గొననున్నారు.