టోక్యో: ఒలింపిక్స్.. ప్రపంచంలోని ఐదు ఖండాలను ఒక్క చోటికి తీసుకొచ్చే ఓ స్పోర్టింగ్ మెగా ఈవెంట్. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితోపాటు హైప్రొఫైల్ అథ్లెట్లు ఈసారి టోర్నీకి దూరంగా ఉండటంతో.. టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్పై ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వే ఒకటి తేల్చింది.
28 దేశాల్లో సర్వే
ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. కేవలం 46 శాతం మంది మాత్రమే ఈ గేమ్స్పై ఆసక్తిగా ఉన్నట్లు సర్వే తేల్చింది. ఇక గేమ్స్ జరిగే జపాన్లో అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ గేమ్స్కు ప్రేక్షకులెవరినీ అనుమతించడం లేదు.
ఆతిథ్య దేశం జపాన్లో ఈ గేమ్స్ షెడ్యూల్ ప్రకారం జరగాలని కేవలం 22 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని ఇప్సోస్ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ గేమ్స్ కోసం పలు దేశాల టీమ్స్ టోక్యో చేరుకున్నాయి. వీళ్లలో కొందరు అథ్లెట్లకు పాజిటివ్గా కూడా తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
తప్పుకున్న స్టార్లు
ఈసారి కరోనా కారణంగా పలువురు స్టార్ అథ్లెట్లు ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నారు. టెన్నిస్ స్టార్లు రోజర్ ఫెదరర్, రఫేల్ నడాల్, సెరెనా విలియమ్స్, గోల్ఫ్ మాజీ నంబర్ వన్ ఆడమ్ స్కాట్, ఫుట్బాల్ స్టార్ నెయ్మార్ జూనియర్లాంటి వాళ్లు ఇప్పటికే గేమ్స్ నుంచి తప్పుకున్నారు.