హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కొత్త టెక్నిక్లపై దృష్టి పెట్టానంటున్నది. అమ్ములపొదిలోని అస్ర్తాలతో ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తానని చెప్పింది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం సింధు మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావంతో అంతర్జాతీయ షెడ్యూల్ నిలిచిపోవడంతో లభించిన అదనపు సమయాన్ని ప్రాక్టీస్కు వినియోగించుకుంటున్నా. ఇటీవల నా ఆట ఎంతో మెరుగైంది. చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో.. విదేశీ కోచ్ పార్క్ సంగ్ సూచనలతో శిక్షణ కొనసాగిస్తున్నా. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం’ అని పేర్కొంది. గత ఒలింపిక్స్ అనుభవాల దృష్ట్యా కొత్త వ్యూహాలతో సింధు సిద్ధమవుతున్నదని గోపీచంద్ పేర్కొన్నాడు. భారత్ నుంచి మహిళల విభాగంలో సింధు, పురుషుల సింగిల్స్ నుంచి సాయిప్రణీత్ విశ్వక్రీడలకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్ నుంచి టోక్యో టికెట్ దక్కించుకున్న సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి కూడా చీఫ్ కోచ్ గోపీచంద్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగిస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ జోడీ తీవ్రంగా శ్రమిస్తున్నది.