న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా( Neeraj Chopra ) చరిత్ర సృష్టించిన సంగతి తెలుసు కదా. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడు. అయితే కీలకమైన ఫైనల్కు ముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనను నీరజ్ ఇప్పుడు బయటపెట్టాడు. నిజానికి తాను ఫైనల్కు సిద్ధమవుతున్న సమయంలో సడెన్గా తన జావెలిన్ కనిపించకుండా పోయిందని అతను చెప్పాడు. ఆ జావెలిన్ను పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ తీసుకెళ్లాడని నీరజ్ అన్నాడు.
ఫైనల్ ప్రారంభమయ్యే ముందు నేను జావెలిన్ కోసం చూస్తున్నాను. కానీ అది దొరకలేదు. అయితే సడెన్గా అది అర్షద్ నదీమ్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్తో అతడు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడు అని నీరజ్ చెప్పుకొచ్చాడు. ఈ గందరగోళం వల్లే తాను తన తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చిందని నీరజ్ అన్నాడు.
ఇక గోల్డ్ మెడల్ గెలిచి వచ్చినప్పటి నుంచీ నీరజ్ సన్మాన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యానికి కూడా గురయ్యాడు. దీనిపై స్పందిస్తూ.. ఇది సరైన పద్ధతి కాదు. మెడల్ గెలవగానే ఇలా అన్నీ ఒకేసారి చేసేయడం. నెల రోజుల తర్వాత పట్టించుకోకపోవడం మంచిది కాదు. స్పోర్ట్స్కు ఎప్పుడూ ఇదే విధమైన అటెన్షన్ ఉండాలని చెప్పాడు.