న్యూఢిల్లీ, జూన్ 30: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే నిర్దిష్ట మొత్తం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని, ప్రభుత్వం వద్ద ఉన్న నిధులు, వనరులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రమే కనీస మొత్తాన్ని నిర్ణయించాలని సూచించింది. ఇందుకు సంబంధించి ఆరు వారాల్లోగా నూతన మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని (ఎన్డీఎంఏ) ఆదేశించింది. అలాగే కరోనా మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీని కూడా సరళతరం చేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని నిర్దేశించింది. తన రాజ్యాంగబద్ధ విధులను నిర్వహించడంలో ఎన్డీఎంఏ విఫలమైందని కోర్టు ఆక్షేపించింది. ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు.. కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందికి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని న్యాయవాదులు రీపక్ కన్సల్, గౌరవ్కుమార్ బన్సల్ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
రూ.4లక్షల చొప్పున చెల్లించలేం
కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించలేమని గత నెలలోనే కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడే విపత్తు నిర్వహణ చట్టం కింద పరిహారం చెల్లించడం సాధ్యమవుతుందని పేర్కొన్నది. కరోనా మృతుల కుటుంబాలన్నింటికీ రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటే విపత్తు నిర్వహణ నిధులన్నీ వాటికే సరిపోతాయని వివరించింది.