పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవి హరిత వనాలే. హరిత వనాలతో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కాలానుగుణంగా వర్షాలు పడతాయి. నేల క్రమక్షయం తగ్గుతుంది. ఇంధన వనరులు, కలప లభ్యమవుతుంటాయి. ఈ వాస్తవాన్ని గుర్తెరిగిన తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని మొక్కలు నాటి పచ్చదనం పెంపొందిస్తూ దేశంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తీర్ణం పెంపుదల కోసం తెలంగాణలో ప్రభుత్వం 2015 నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంతో సాగుతున్న కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. గత ఆరున్నరేండ్లలో పట్టణాల్లో, పల్లెల్లో, అడవుల్లో సుమారు 200 కోట్లకు పైగా మొక్కలను నాటడంతో రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2015-19 మధ్యకాలంలో లక్షా 85 వేల ఎకరాల్లో పచ్చదనం పెరిగింది. 18 శాతం ఉన్న అటవీ విస్తీర్ణం 24 శాతానికి చేరుకున్నది. హరితహారంలో భాగంగా హైదరాబాదులో 2020 వరకు 2.4 కోట్ల మొక్కలను నాటినట్లు అర్బన్ డే ఫౌండేషన్ పేర్కొన్నది. హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్ పేరుతో తక్కువ విస్తీర్ణంలో మియవాకి పద్ధతుల్లో చిట్టడవులను పెంచుతున్నారు.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం హైదరాబాదుకు అరుదైన గుర్తింపు తీసుకువచ్చింది. ఐరాసకు సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కు అనుబంధంగా పనిచేసే అర్బన్ డే ఫౌండేషన్ సంస్థ- 2020 సంవత్సరానికిగాను హైదరాబాద్ను ‘ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్’ (ప్రపంచ చెట్ల నగరం)గా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాసియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి నగరంగా హైదరాబాద్ నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా రాష్ట్ర ప్రజలు కోటి వృక్షార్చన చేసిన మరుసటి రోజే ఈ ఘనత లభించింది. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అనేకమంది ప్రముఖులు మొక్కలు నాటి మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం చూసినా పచ్చదనమే కనువిందు చేస్తున్నది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో హరితహారాన్ని భాగం చేస్తూ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేలా చూస్తున్నారు. వాటిలో కనీసం 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పల్లె పట్టణ ప్రకృతి వనాలతో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరుతూ స్వచ్ఛమైన వాయువులను పొందుతున్నారు. మొక్కలను ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆయురారోగ్యాలు లభిస్తాయి. గ్లోబల్ వార్మింగ్ నుంచి మనలను మనం కాపాడుకోవాలన్నా, స్వచ్ఛమైన ప్రాణవాయువు తీసుకోవాలన్నా, సహజ వాతావరణంలో జీవించాలన్నా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నా పెద్ద ఎత్తున మొక్కలు నాటవలసిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అనుసరిస్తే మన దేశం హరిత దేశంగా విలసిల్లుతుంది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తమవంతు బాధ్యత నెరవేర్చాలి.
పుల్లూరు వేణుగోపాల్
(నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం)