నల్లగొండ : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి కేంద్రంగా నకిలీ బయో డీజిల్ తయారు చేస్తున్న గుండా సంతోష్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం డీఎస్పీ వివరాలను వెల్లడించారు. నార్కట్ పల్లి మండల పరిధిలోని గోపలాయ పల్లి గ్రామ శివారులో నంద కిషోర్ అనే వ్యక్తికి చెందిన గోడౌన్ ను నల్లగొండ పట్టణానికి చెందిన గుండా సంతోష్ లీజుకు తీసుకున్నాడు. మహారాజ ఎంటర్ ప్రైజెస్ పేరుతో వివిధ రకాల ఆయిల్స్తో కల్తీ డీజిల్ తయారు చేసి బయో డీజిల్ పేరుతో అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నాడని పౌర సరఫరాల శాఖ ఆర్.ఐ. ప్రభుదాస్ నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి సమగ్రంగా విచారణ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
గతంలో సంతోష్ కిరోసిన్ డీలర్గా పని చేస్తూ పలు పెట్రోలియం కంపెనీలకు రవాణా నిమిత్తం ట్యాంకర్లను అద్దెకు ఇస్తూ పెట్రోలియం రంగంలో జరుగుతున్న మార్పులను తెలుసుకున్నాడు. వివిధ రకాల అయిల్స్ ను సరైన మోతాదులో కలిపి కల్తీ డీజిల్ తయారు చేసి బయో డీజిల్ గా ప్రజలను నమ్మించి మోసం చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ తాను తయారు చేస్తున్న నకిలీ డీజిల్ విక్రయించడానికి ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా నెలకు లక్ష లీటర్ల చొప్పున కల్తీ డీజిల్ విక్రయిస్తున్నట్లుగా నిర్ధారణ అయినట్లు డీఎస్పీ వివరించారు.
ఇతనికి సహకరించిన హరికృష్ణా రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్టర్ శంకర్ నాయక్, విజయవాడ ఆటో నగర్ కు చెందిన రామ్మోహన్ రావు, అద్దంకి పట్టణానికి చెందిన మాధవ రావు, గుంటూరు ఆటో నగర్ కు చెందిన కిరణ్, హనుమాన్ జంక్షన్ ఆటో నగర్ కు చెందిన ప్రతాప్, సంతోష్ దగ్గర పని చేస్తున్న జానయ్య, భాస్కర్ లపై కేసు నమోదు చేశామని, వీరంతా పరారీలో ఉన్నారన్నారు.
వారందరినీ త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని వెంకటేశ్వర్ రెడ్డి వివరించారు.కేసు విచారణలో సమర్ధవంతంగా పనిచేసిన నార్కట్ పల్లి సీఐ శంకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సీఐలు ఎస్.ఎం. బాషా, బాలగోపాల్, నార్కట్ పల్లి ఎస్.ఐ. యాదయ్య, సిబ్బంది సుధాకర్, నర్సింహా లను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు