ప్రపంచాన్ని జయించిన ఇమ్రాన్ ఖాన్ వల్ల కాలేదు!!స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్కు వశపడలేదు..!! గండర గండడు షాహీద్ అఫ్రిదికి సాధ్య పడలేదు!! కానీ బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్రకు నాంది పలికాడు!
విశ్వవేదికపై టీమ్ఇండియాను ఓడించాలనుకున్న పాకిస్థాన్ చిరకాల స్వప్నం ఇన్నేండ్లకు నెరవేరింది. వన్డే, టీ20 ప్రపంచకప్లలో కలిపి ఇప్పటి వరకు భారత్ చేతిలో 12 సార్లు ఓడిన పాక్ పదమూడో ప్రయత్నంలో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. షాహీన్ షా అఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్కు ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజేయ అర్ధశతకాలు తోడవడంతో కోహ్లీసేనపై పాక్ పైచేయి సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరిపోరాటం భారత్ భారీ స్కోరుకు బాటలు వేయలేకపోయింది. అఫ్రిది సూపర్ బౌలింగ్తో సూపర్ ఓవర్లోనే రోహిత్శర్మ, రాహుల్, సూర్యకుమార్ వికెట్లను కోల్పోయిన టీమ్ఇండియా మళ్లీ కోలుకోలేపోయింది. మిడిల్లో పంత్ దూకుడు కనబరిచినా.. హార్దిక్ పాండ్యా అంచనాలు అందుకోలేకపోయాడు. లక్ష్యఛేదనకు దిగిన పాక్..భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్ కోల్పోకుండా విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం :ఐపీఎల్లో మెరుపులు మెరిపించడంతో మెగాటోర్నీకి సిద్ధమైన భారత ఆటగాళ్లు తొలి మ్యాచ్లోనే తేలిపోయారు. నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కోలేక ఆరంభంలోనే ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం ఇచ్చిన టీమ్ఇండియా.. ఆ తర్వాత ఏ దశలోనూ తిరిగి పోటీలోకి రాలేకపోయింది. అదనపు బౌలర్ అవసరం లేదు అని మ్యాచ్ ఆరంభానికి ముందు విరాట్ చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. ప్రధాన బౌలర్లే ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన చోట అదనపు బౌలర్ ఉన్న పెద్ద ప్రయోజనం ఉండేది కాదేమో! రోహిత్, రాహుల్, సూర్యకుమార్ ఇలా టాపార్డర్ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరినా.. నడిపించే నాయకుడు క్రీజులోనే ఉండటంతో అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం పడలేదు. అందుకు తగ్గట్లే యాంకర్ రోల్ పోషిస్తూ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ అతడికి కాసేపు సహకరించాడు. పిచ్ మరీ అంత ప్రమాదకరంగా లేకున్నా.. మనవాళ్లు అనవసర ఒత్తిడికి లోనై అప్పనంగా వికెట్లు సమర్పించుకున్నారు.
విరాట్ అర్ధశతకంతో కాస్త కోలుకున్న జట్టును రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా భారీ స్కోరు వైపు తీసుకెళ్తారేమో అనుకుంటే.. ఎన్నో ఆశల మధ్య క్రీజులోకి వచ్చిన వీరిద్దరూ భారీ షాట్లు కొట్టలేకపోయారు. ఫలితంగా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన కోహ్లీసేన.. బౌలింగ్లోనూ అద్భుతాలు చేయలేకపోయింది. భారత ఆటగాళ్లు క్రీజులో నిల్చునేందుకు నానా తంటాలు పడ్డ చోట పాక్ ఓపెనర్లు పరుగుల వరద పారించారు. భువనేశ్వర్, బుమ్రా, షమీ, వరుణ్, జడేజా ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా దంచికొట్టారు. షాహీన్ షా అఫ్రిది తన స్వింగ్తో టీమ్ఇండియా టాపార్డర్ను వణికించిన చోట.. మనవాళ్లు కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక చేష్టలుడిగి చూస్తుండిపోయారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను పక్కనపెట్టి అవకాశమిచ్చిన వరుణ్ చక్రవర్తి ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. అత్యవసరమైతే బౌలింగ్ చేస్తానన్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మైదానంలోనే అడుగు పెట్టలేకపోయాడు. ప్రపంచకప్ నెగ్గకపోయిన ఫర్వాలేదు.. పాకిస్థాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దు అనుకునే సగటు భారత క్రీడాభిమానిని నిరాశలోకి నెట్టిన కోహ్లీసేన.. ఇక విశ్వకప్ నెగ్గి ఈ గాయానికి మందు పూస్తుందేమో చూడాలి!
దుబాయ్: విశ్వవేదికపై టీమ్ఇండియా తిరుగులేని రికార్డును పాకిస్థాన్ బద్దలు కొట్టింది. ఐసీసీ ప్రపంచకప్లలో భారత్ చేతిలో ఇప్పటి వరకు పన్నెండు సార్లు ఓటమి పాలైన పాకిస్థాన్.. తొలిసారి విజయం వైపు నిలిచింది. సూపర్-12 గ్రూప్-2లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్పై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీతో రాణించగా.. రిషబ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ షాహీన్ షా అఫ్రిది 3, హసన్ అలీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకాలతో దుమ్మురేపడంతో పాకిస్థాన్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది.
ఒకే ఒక్కడు
నాణ్యమైన పేస్ను ఎదుర్కోవడంలో ఓపెనర్లు విఫలమవడంతో టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి హిట్మ్యాన్ రోహిత్ శర్మ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న షాహీన్ షా.. తన తదుపరి ఓవర్లో లోకేశ్ రాహుల్ (3)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) వీరిని అనుసరించడందో పవర్ప్లే ముగిసేసరికి భారత్ 36/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భూజానెత్తుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సంయమనంతో ఆడుతూ స్కోరు పెంచాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (13), హార్దిక్ పాండ్యా (11) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఆడుతూ పాడుతూ..
భారత్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాకిస్థాన్.. బ్యాటింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. సొంతగడ్డలాంటి దుబాయ్ పిచ్పై పాక్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే దంచుడు ప్రారంభించారు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో 4,6తో రిజ్వాన్ షురూ చేసిన బాదుడు.. ఇన్నింగ్స్ ముగిసే వరకు విజయవంతంగా సాగింది. తొలి నాలుగు ఓవర్లను నలుగురు వేర్వేరు బౌలర్లతో వేయించినా భారత్కు ఒక్క వికెట్ దక్కలేదు. మంచి బంతులను ఆచితూచి ఆడిన పాక్ ఓపెనర్లు.. చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడంతో ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టిన ఈ జోడీ మరో 13 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించింది.
స్కోరు బోర్డు
భారత్: రాహుల్ (బి) షాహీన్ షా 3, రోహిత్ (ఎల్బీ) షాహీన్ షా 0, కోహ్లీ (సి) రిజ్వాన్ (బి) షాహీన్ షా 57, సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) హసన్ అలీ 11, పంత్ (సి అండ్ బి) షాదాబ్ 39, జడేజా (సి) (సబ్) నవాజ్ (బి) హసన్ అలీ 13, హార్దిక్ (సి) బాబర్ (బి) రౌఫ్ 11, భువనేశ్వర్ (నాటౌట్) 5, షమీ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 151/7. వికెట్ల పతనం: 1-1, 2-6, 3-31, 4-84, 5-125, 6-133, 7-146, బౌలింగ్: షాహీన్ షా 4-0-31-3, వసీమ్ 2-0-10-0, హసన్ 4-0-44-2, షాదాబ్ 4-0-22-1, హఫీజ్ 2-0-12-0, రౌఫ్ 4-0-25-1.
పాకిస్థాన్: రిజ్వాన్ (నాటౌట్) 78, బాబర్ (నాటౌట్) 68, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 17.5 ఓవర్లలో 152/0. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-25-0, షమీ 3.5-0-42-0, బుమ్రా 3-0-22-0, వరుణ్ 4-0-33-0, జడేజా 4-0-28-0.