జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. టీ20ల్లోనూ బోణీ కొట్టింది. శనివారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో పాక్ 4 వికెట్ల తేడాతో ఆతిథ్య సఫారీ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. మార్క్మ్ (51), క్లాసెన్ (50) మెరుపు అర్ధశతకాలతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్ (74నాటౌట్) అదరగొట్టగా.. చివరి మూడు ఓవర్లకు 38 పరుగులు అవసరమైన దశలో ఫహీమ్ అష్రఫ్ (30) మెరిపించాడు. చివరి ఓవర్లో హసన్ అలీ (9 నాటౌట్) రెండు ఫోర్లు బాదడంతో ఓ బంతి మిగిలి ఉండగానే పాక్ గెలిచింది.