వరంగల్ మహానగరానికి దాని అవసరం ఎంతో ఉంది
కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
కాజీపేటను డివిజన్ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత కేంద్రానిదే
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
కోచ్ ఫ్యాక్టరీ సాధించే దాకా ముమ్మర పోరాటం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
హైదరాబాద్లోని ధర్నాచౌక్లో అఖిల పక్ష పార్టీలు, కార్మిక సంఘాల నిరసన దీక్ష
నినాదాలతో దద్దరిల్లిన రాజధాని
‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది అని ఆశలు పెట్టుకున్న యువతకు బీజేపీ సర్కారు మొండిచెయ్యి చూపింది. విభజన చట్టంలోనే స్పష్టంగా ఉన్న ఈ అంశానికి నీళ్లొదిలి వరంగల్కు తీరని అన్యాయం చేసింది’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్లో ‘కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ పోరాట సమితి’ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి బోయినపల్లి మాట్లాడారు. ఓరుగల్లు మహానగరానికి కోచ్ ఫ్యాక్టరీ అవసరం ఎంతగానో ఉన్నదని, అది ఇక్కడి ప్రజల దశాబ్దాల కల అని, ఇప్పటికైనా కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో రాజధాని దద్దరిల్లింది.
వరంగల్ నుంచి భారీగా తరలిన నేతలు
మహా నిరసన దీక్షకు మద్దతుగా కాజీపేట నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేశ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యు డు సుంచు కృష్ణ మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభు త్వం ఇప్పడు అవసరం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ, డివిజన్ ఏర్పాటయ్యేదాకా ఉద్యమిస్తామన్నారు. తరలివెళ్లిన వారిలో కాటాపురం రాజు, అయ్యాల దానం, తేలు సారంగపాణి, శిరుమల్ల దశరథం, పాలగుడుల శివకుమార్, మర్యాల కృష్ణ, సుంచు అశోక్, సంకు నర్సింగ్, దువ్వ కనుకరాజు, నయీం జుబేర్, నరేశ్, తండమల్ల వేణు, సయ్యద్ సర్వర్, కొండ్ర శంకర్, పాము రాజేశ్, నజీరుద్దీన్, మల్లేశ్, మండల సుబ్బు, వెనిశెట్టి వేణు, సుంచు రఘురాం, ఫర్హాన్ తదితరులున్నారు.
ఇది ప్రజా ఉద్యమంగా మారాలి : దాస్యం
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన అనేది ప్రజా ఉద్యమంగా మారాలని అభిప్రాయపడ్డారు. గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఒక సైనికుడిగా ముందుకొస్తానన్నారు. పార్టీ ఆదేశం మేరకే దీక్షలో పాల్గొన్నానని చెప్పారు. కాజీపేటను డివిజన్గా తీర్చిదిద్దే బాధ్య త కేంద్రంపైనే ఉందన్నారు. కోచ్ఫ్యాక్టరీ కోసం ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసేలా కృషిచేస్తానని చెప్పారు.
పోరాటం ఉధృతం : చాడ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కాజీపైటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మెడలు వంచేలా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కోచ్ఫ్యాక్టరీ అంశం రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగమేనని గుర్తు చేశారు. ఫ్యాక్టరీని సాధించేదాకా పోరాటాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. పోరాట సమితి అధ్యక్షుడు గాదె ఇన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, టీపీసీసీ సభ్యురాలు రవళి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.