న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అపారమైన కీర్తిప్రతిష్ఠలు సాధించినా.. చెడు సాహవాసాల వల్ల దారితప్పిన సుశీల్కు తన పాత మిత్రులతోనే ప్రాణహాని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ గ్యాంగ్స్టర్ కాలా జఠేడి.. సుశీల్పై పగబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో కాలా జఠేడితో సంబంధాలు కొనసాగించిన సుశీల్.. అతడి సమీప బంధువైన సాగర్ రాణా తనపై బురదజల్లుతున్నాడనే అనుమానంతోనే హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కాలా జఠేడి.. సుశీల్కు హాని చేయొచ్చని అనుమానిస్తున్నారు.