న్యూఢిల్లీ: మెగా క్రీడా సంబురం ఒలింపిక్స్ టోక్యోలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఇండియా ఓ మెడల్ కూడా గెలిచింది. ఇటు ఇండియాలో స్పోర్ట్స్ లవర్స్ టీమిండియాను చీర్ చేయడానికి ఒలింపిక్ థీమ్తో ఉన్న మర్చండైజ్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. టీషర్ట్స్, మగ్గులు, బాటిల్స్ నుంచి మాస్కుల వరకూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఒలింపిక్ మాస్కులకైతే డిమాండ్ మరింత ఎక్కువగా ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే తమ మాస్కులు సూపర్ హిట్ అయ్యాయని ఢిల్లీకి చెందిన మర్చండైస్ అనే స్టార్టప్ ఓనర్ యష్ గుప్తా చెప్పారు.
ఏదో మొదట్లో ఇలాంటి 2 వేల మాస్కులను తాము తయారు చేశామని, అయితే రోజురోజుకూ బుకింగ్స్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నట్లు ఆయన తెలిపారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం ఒకేసారి పెద్ద మొత్తంలో కొంటున్నట్లు చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ క్లబ్స్ కూడా ప్లేయర్స్, కోచ్లు, మేనేజ్మెంట్ కోసం ఈ ఒలింపిక్ మర్చండైజ్ను కొనుగోలు చేస్తున్నాయి. చీర్ ఫర్ ఇండియా థీమ్తోనూ వస్తున్న టీషర్ట్స్, మాస్కులకు కూడా డిమాండ్ భారీగానే ఉంటోంది.