టోక్యో : బెలారస్ (Belarus ) కు చెందిన అథ్లెట్ క్రిస్టినా సిమనోస్కయా ( Krystsina Tsimanouskaya ) టోక్యోలో కిడ్నాప్ ( Kidnap ) కు గురైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆమె టోక్యోలోని హనీదా విమానాశ్రయ హోటల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బెలారస్ తరపున ఇప్పటికే వంద మీటర్ల ఈవెంట్ హీట్స్లో పాల్గొన్నది ఆమె. ఇంకా 200మీ, 4×400మీ ఈవెంట్లో ఆమె పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ దేశ కోచ్లపై విమర్శలు చేయడంతో ఆమెను తన రూమ్ నుంచి విమానాశ్రయానికి లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆ అథ్లెట్ .. టోక్యో ఒలింపిక్ అధికారులకు ఫిర్యాదు చేసింది. జపాన్ పోలీసుల నుంచి కూడా ఆమె ఆశ్రయం కోరింది.
బెలారస్లో ఆ దేశాధ్యక్షుడు లుకషెంకో.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ర్యాన్ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసి మరీ ఓ జర్నలిస్టును అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అథ్లెట్లును కూడా ఇటీవల అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ టీమ్ మేనేజ్మెంట్ సరిగా లేదని, కోచ్లు వ్యవహరిస్తున్న తీరు కూడా అభ్యంతరకంగా ఉన్నట్లు అథ్లెట్ క్రిస్టినా తన ఇన్స్టాలో తాజాగా ఓ పోస్టు పెట్టింది.
కోచ్లను విమర్శించినందుకే తనను బలవంతంగా ఎయిర్పోర్ట్ తీసుకువెళ్లినట్లు ఆమె ఆరోపిస్తున్నది. కానీ అథ్లెట్ క్రిస్టినా ఆరోగ్యం బాగాలేదని, మానసికంగా ఆమె కుంగిపోయినట్లు బెలారస్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆ అథ్లెట్కు వీసా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెక్ రిపబ్లిక్, పోలాండ్ దేశాలు పేర్కొన్నాయి. యూరోప్ దేశాల్లో ఆశ్రయం పొందాలని క్రిస్టినా భావిస్తున్నది. జపాన్ అధికారుల వద్దే ఆమె ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు. యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ ఆమె విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.