లండన్: అతడు ఇప్పుడు టెన్నిస్ ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్స్లో ఒకడు. 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్తో రోజర్ ఫెదరర్, రఫేల్ నడాల్ల సరసన నిలిచాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్లో బెరెటినిపై గెలిచిన జోకొవిచ్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ వరల్డ్ నంబర్ వన్కిది ఆరో వింబుల్డన్ టైటిల్ కాగా.. మొత్తంగా 20వ గ్రాండ్స్లామ్ టైటిల్. ఇంత సాధించినా.. గెలిచిన తర్వాత అతడు మాట్లాడిన మాటలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఈ టైటిల్తో మీరు ఫెదరర్, నడాల్ సరసన నిలిచారు కదా.. ఎలా అనిపిస్తోంది అని అడిగితే.. జోకొవిచ్ ఎంతో వినమ్రంగా సమాధానమిచ్చాడు.
అసలు వాళ్లిద్దరి వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని జోకొవిచ్ అన్నాడు. మా ముగ్గురిలో ఎవరూ ఇంతటితో ఆగరు. మాది అద్భుతమైన ప్రయాణం. మా స్పోర్ట్లో వాళ్లిద్దరూ లెజెండ్స్. నా కెరీర్లో ఎదుర్కొన్న ఇద్దరు ముఖ్యమైన ప్లేయర్స్. వాళ్ల వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. కెరీర్లో ఎదగాలంటే మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఎలా ఉండాలో వాళ్ల నుంచే నేర్చుకున్నాను. నేను టాప్ 10లోకి వచ్చిన తర్వాత తొలి మూడు నాలుగేళ్లు వీళ్లతో ఆడిన చాలా పెద్ద మ్యాచ్లలో నేను ఓడిపోయాను అని జోకొవిచ్ అన్నాడు.
2007లో వీళ్లిద్దరిపై అతడు తొలిసారి గెలిచాడు. అంతకుముందు నడాల్తో రెండుసార్లు, ఫెదరర్తో నాలుగుసార్లు ఓడిపోయాడు. 2007లో గెలిచిన తర్వాత ఇక అతడు వెనుదిరిగి చూసుకోలేదు. ఈ ఇద్దరికీ చెమటలు పట్టించాడు. ఈ ఇద్దరిపై ఇప్పుడు జోకొవిచ్దే పైచేయి. ఫెదరర్పై 27-23 రికార్డు ఉండగా.. నడాల్పై 30-28 రికార్డు ఉండటం విశేషం.