మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా పట్టించుకోకుండా ముంబైని ఐపీఎల్ వేదికగా ఎంపిక చేశారు. అహ్మదాబాద్ కేంద్రంగా ఫ్రాంచైజీ లేకపోయినా.. అత్యధికంగా 12 మ్యాచ్లకు అవకాశమిచ్చారు.
మెరుగైన వసతులతో పాటు ఇతర మెట్రోసిటీలతో పోలిస్తే కొవిడ్-19 కేసులు నియంత్రణలో ఉన్నా.. హైదరాబాద్కు మాత్రం మొండిచేయి తప్పలేదు!
బయోబబుల్ కారణంగా ఎంపిక ప్రక్రియ జరిగిందని చెప్పేందుకు కూడా లేదు. ఆ లెక్కన చూస్తే ముంబై అసలు ఆ జాబితాలోనే ఉండాల్సింది కాదు. ఇక వసతుల విషయానికొస్తే.. మిగిలిన నగరాలకు హైదరాబాద్ ఏమాత్రం తీసిపోదు. గుజరాత్ నుంచి ఫ్రాంచైజీ లేకున్నా కేవలం బోర్డు కార్యదర్శి జై షా ప్రోద్బలం కారణంగానే అత్యధిక మ్యాచ్లు అహ్మదాబాద్కు తరలి వెళ్లాయనేది సుస్పష్టం. వేదికల ఎంపికకు ముందే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీసీసీఐతో పాటు ఐపీఎల్ పాలకవర్గానికి విన్నవించినా.. లాబీయింగ్ చేసిన వారికే ఎక్కువ అవకాశాలు దక్కడం గమనార్హం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి విదేశాల్లో జరిగిన సీజన్లు మినహా ప్రతీ ఏటా హైదరాబాద్లో మ్యాచ్లు జరిగాయి. ఆతిథ్యంతో పాటు అభిమానంలో హైదరాబాదీల మర్యాదలను గతంలో ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులు ప్రశంసించారు. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్కు ఈ సారి ఐపీఎల్ సీజన్లో ఒక్క మ్యాచ్కు ఆతిథ్యమిచ్చే అవకాశం కూడా దక్కలేదు. దీనివెనుక బీసీసీఐ కార్యదర్శి జై షా హస్తం ఉందనేది కాదనలేని వాస్తవం. ఐపీఎల్ వేలానికి ముందే అహ్మదాబాద్ వేదికగా కొత్త ఫ్రాంచైజీని తెరపైకి తేవాలని ప్రయత్నించినా.. తగినంత సమయం లేకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో తన పరపతిని ఉపయోగించి ఈ సీజన్లో అత్యధిక మ్యాచ్లు అహ్మదాబాద్లో జరిగే విధంగా పావులు కదిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు కనీసం ఒక్క మ్యాచ్ అవకాశం కూడా ఇవ్వకుండా గండికొట్టారు.
ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించినప్పటి నుంచి అహ్మదాబాద్లోనే ఎక్కువ మ్యాచ్లు నిర్వహించేందుకు బోర్డు ఆసక్తి చూపిస్తున్నది. ఇంగ్లండ్తో చివరి రెండు టెస్టులు ఇదే స్టేడియంలో జరుగగా.. శుక్రవారం నుంచి మొతెరా వేదికగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయినా మళ్లీ అక్కడే ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు జరుగడం వెనుక ఉన్న మతలబేంటో బోర్డు పెద్దలకే తెలియాలి. దేశంలో మరెన్నో మంచి వేదికలున్నా కేవలం గుజరాత్ గురించే చర్చించుకునే విధంగా పదేపదే ఇక్కడ మ్యాచ్లు జరుగడం సరైంది కాదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేసరికి కొవిడ్-19 ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి.. అందుకు తగ్గట్లే రెండో దశ మ్యాచ్లే అహ్మదాబాద్లో జరిగే విధంగా షెడ్యూల్ను రూపొందించడం కొసమెరుపు. ప్లేఆఫ్స్ సమయానికి సగం మంది ప్రేక్షకులను అనుమతించినా.. 60 వేల పైచిలుకు అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. దీంతో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు.. ఫ్రాంచైజీల నుంచి వచ్చే మొత్తం, బీసీసీఐ నుంచి వచ్చే వాటాలతో అహ్మదాబాద్కు ఆర్థికంగా ఢోకా లేకుండా పోనుంది.
ఐపీఎల్ షెడ్యూల్ రూపకల్పన ప్రారంభమైన సమయంలోనే తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్కు ఆతిథ్య అవకాశం ఇవ్వాలని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే కొవిడ్-19 కేసులు తక్కువగా నమోదయ్యాయని.. ఇక్కడ మ్యాచ్లు నిర్వహిస్తే ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో హెచ్సీఏ కూడా ఇక్కడ మ్యాచ్లు నిర్వహించాలని తీర్మానం చేసి బీసీసీఐకి నివేదించింది. అయినా పట్టించుకోని బోర్డు.. హైదరాబాద్కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో లీగ్ ఆతిథ్య అవకాశాన్ని కోల్పోయిన హెచ్సీఏ.. సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి లభించే మొత్తంతో పాటు బీసీసీఐ నుంచి వచ్చే ఐపీఎల్ వాటాలను కూడా కోల్పోనుంది. దీంతో ఆర్థికంగా చాలా నష్టపోనుంది.
వేదిక మ్యాచ్ల సంఖ్య