న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. జాతీయ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా హత్యతో సంబంధముందన్న ఆరోపణలు వచ్చినప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న సుశీల్పై ఢిల్లీలోని రోహిణి కోర్టు శనివారం వారంట్ ఇచ్చింది. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో సాగర్ మృతి చెందాడు. సుశీల్తో పాటు మరికొందరు రెజ్లర్లు దాడి చేయడంతోనే సాగర్ మృతి చెందినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఢిల్లీ పోలీసులు సుశీల్ కోసం గాలిస్తుండగా.. అతడు తప్పించుకొని తిరుగుతున్నాడు. మొత్తంగా సుశీల్పై హత్య, క్రిమినల్ కుట్ర, అపహరణ నేరాల కింద ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే సుశీల్ను పట్టించిన వారికి నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించాలనే యోచనలోనూ ఢిల్లీ పోలీసులు ఉన్నట్టు సమాచారం. అయితే హరిద్వార్లోని ఓ యోగా ఆశ్రమంలో సుశీల్ ఉన్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.