న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు రెండు వేలకు, యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరింది. దీంతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరిగింది. ఐసీయూ వార్డులోని పడకలు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీయూ పడకల కొరత ఉన్నట్లు ప్రైవేట్ ఆసుపత్రులు వెల్లడించాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా యాప్ ప్రకారం ప్రముఖమైన నాలుగైదు ఆసుపత్రుల్లోని ఐసీయూ వార్డుల్లో వెంటిలేటర్లతో కూడిన పడకలు ఒక్కటి కూడా ఖాళీగా లేదని తెలుస్తున్నది.
ఓఖ్లాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో మొత్తం ఎనిమిది ఐసీయూ పడకలు రోగులతో నిండిపోయాయి. షాలిమార్ బాగ్లోని ఫోర్టిస్ హాస్పిటల్, మ్యాక్స్ హాస్పిటల్, వసంతకుంజ్లోని ఇండియన్ స్పైనల్ సెంటర్ ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలు అందుబాటులో లేవు. సర్ గంగారాం ఆసుపత్రిలో మాత్రం ఒక ఐసీయూ బెడ్ ఖాళీగా ఉన్నట్లు ఆ యాప్లో పేర్కొన్నారు.
మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా రోగులకు కేటాయించిన 5,765 పడకల్లో 4,301 ఖాళీగా ఉన్నాయి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ బెడ్లు 544, వెంటిలేటర్లు లేని ఐసీయూ బెడ్లు 887 అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా యాప్ ద్వారా తెలుస్తున్నది. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో ఆసుపత్రులు ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.