బంజారాహిల్స్, మే 25 : వ్యాపార భాగస్వాముల మధ్యన గొడవలు జరిగిన సమయంలో తనకు మద్దతు తెలుపలేదని కోపం పెంచుకుని యువకుడిని కిడ్నాప్ చేసి గదిలో బంధించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ఆల్విన్కాలనీలో నివాసముంటున్న అన్నే రవితేజ (28) జూబ్లీహిల్స్ రోడ్ నం 2లో ఎస్ఎస్ ఫౌండేషన్ పేరుతో రిహాబిలేషన్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. గతంలో ఈ సెంటర్ నిర్వహణలో భాగస్వాములుగా వెంకటవంశీతో పాటు మరో ఇద్దరు ఉండేవారు. అయితే భాగస్వాముల మధ్య గొడవలు రావడంతో వెంకటవంశీ బయటకు వెళ్లిపోయాడు. ఇటీవల దీనికి సంబంధించిన వివాదంలో రవితేజ తనకు మద్దతు ఇవ్వలేదని వెంకటవంశీ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రవితేజ కార్యాలయానికి వచ్చిన వెంకటవంశీతో పాటు మరో ముగ్గురు రవితేజను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ధూల్పేటలోని ఓ గదిలో బంధించడమే కాకుండా దుర్భాషలాడుతూ కర్రలతో దాడి చేశారు. సోమవారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో రవితేజను కారులో తీసుకువచ్చి జూబ్లీహిల్స్లో వదిలిపెట్టారు. ఈ మేరకు రవితేజ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.