ముంబై: ఈ ఏడాది చివర్లో టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్, కొవిడ్-19 సంబంధిత ఆంక్షల కారణంగా ఈ టూర్ను వాయిదా వేశారు. వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా న్యూజిలాండ్తో ఇండియా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ఈ మూడు మ్యాచ్ల కోసం 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వస్తోంది. దీంతో ఈ టూర్ను వాయిదా వేసి.. వచ్చే ఏడాది జరపనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీమిండియా ఈ మ్యాచ్లు ఆడుతుందని తెలిపారు.
అయితే ఈ ఏడాది నవంబర్లో న్యూజిలాండ్ మాత్రం రెండు టెస్టులు, మూడు టీ20ల కోసం ఇండియాకు రానుంది. అటు న్యూజిలాండ్ వచ్చే సమ్మర్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలకు ఆతిథ్యమివ్వనుంది. దీనికితోడు మార్చి-ఏప్రిల్ నెలల్లో వుమెన్స్ వరల్డ్కప్లోని ఏడు జట్లకు కూడా న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తోంది. విదేశీ పర్యటన నుంచి వచ్చే న్యూజిలాండ్ టీమ్ 14 రోజుల క్వారంటైన్లో ఉండి, టీమిండియాతో సిరీస్ ఆడి.. డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్ట్లో ఆడటం సాధ్యం కాదన్న ఉద్దేశంతో ఈ టూర్ను వాయిదా వేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.