తిరువనంతపురం: సంపూర్ణ అక్షరాస్యతకు పెట్టింది పేరు ఆ రాష్ట్రం.. అలాగే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరొందింది కూడా.. ఆ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు.. అదే కేరళ.. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. సీపీఎం సారధ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉంది.. సీఎంగా సీపీఎం నేత పినరాయి విజయన్ కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తన సొంత జిల్లా కన్నూరులోని ధర్మాడం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతోపాటు విజయన్ సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. అయితే, ఆశ్చర్యకరమైన సంగతేంటంటే.. ఆయన ఆస్తుల విలువ రూ. కోటి లోపే..
పినరాయి విజయన్ ఆస్తులన్నీ రూ.54 లక్షలే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఆయన వార్షిక ఆదాయం రూ.2.87 లక్షలు. తనకు రెండు సొంత ఇండ్లు ఉన్నాయని పేర్కొన్న విజయన్ సొంత వాహనమే లేదని ప్రకటించారు. తన పేరిట రూ.51.95 లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు.
అయితే తన భార్య పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నాయన్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా రిటైరయ్యారని అఫిడవిట్లో పినరయి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే వీరిద్దరికీ అప్పులు కూడా ఏమీ లేకపోవడం మరో విశేషం. భార్య పేరిట రూ.3.3 లక్షలు విలువ గల 80 గ్రాముల బంగారం ఉంది.
తనపై రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అఫిడవిట్లో పినరాయి విజయన్ వెల్లడించారు. 2016 నుంచి కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో వచ్చేనెల ఆరవ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 2వ తేదీన విడుదల అవుతాయి.