అంతర్జాతీయ కార్మిక సంఘాలు నిత్యం నినదించే ‘సమాన పనికి సమాన వేతనం’ అన్న మూలసూత్రాన్ని న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ఒంటబట్టించుకుంది. తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. న్యూజిలాండ్ లో ఇకనుంచి పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనం ఇవ్వనున్నట్టు NZC సంచలన ప్రకటన చేసింది.
రాబోయే ఐదేండ్లకు గాను న్యూజిలాండ్ క్రికెట్.. జాతీయ జట్టుకు ఆడబోయే క్రికెటర్లకు ఇచ్చే వేతనాలను సమానంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు NZC ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా పురుష, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు సమానంగా వర్తిస్తుంది. టీ20, వన్డే, టెస్టు.. ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ఫీజు మాత్రం ఇరు జట్లకు సమానంగా ఉండేలా కొత్త నిబంధలను తీసుకొచ్చింది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లకూ సమానంగా మ్యాచ్ ఫీజులను అందించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం NZC తో పాటు, న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్, క్రికెటర్లకు సంబంధించిన మరో ఆరు అసోసియేషన్స్ దీని మీదే పనిచేస్తున్నాయని NZC తెలిపింది.
తాజా ఒప్పందం ప్రకారం.. రాబోయే ఐదేండ్ల కాలంలో తమకు వచ్చే ఆదాయం (349 న్యూజిలాండ్ మిలియన్ డాలర్లని అంచనా) మెన్, విమెన్ ప్రొఫెషనల్ ప్లేయర్లకు 29.75 శాతం ఆదాయాన్ని సమానంగా పంచనున్నారు. జాతీయ జట్లతో పాటు దేశవాళీ క్రికెట్ కాంట్రాక్టులలో కూడా ఇది వర్తిస్తుంది. కాగా.. NZC తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ మహిళా జట్టు సారథి సోఫీ డెవిన్ తో పాటు పురుష జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ హర్షం వ్యక్తం చేశారు.
New Zealand cricket takes the first step towards gender pay equality!https://t.co/zt8RIBilR0 pic.twitter.com/seGeaIiUP7
— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2022