న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్స్ చరిత్రలో కేవలం ఇద్దరు అథ్లెట్లే వ్యక్తిగత స్వర్ణాలు సాధించారు. పై ఫొటోలో ఉన్నది ఆ ఇద్దరే. ఒకరు 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్లో గోల్డ్ గెలిచి చరిత్ర సృష్టించిన అభినవ్ బింద్రా కాగా.. మరొకరు మొన్న టోక్యో ఒలింపిక్స్లో ఏకంగా అథ్లెటిక్స్లోనే గోల్డ్తో చరిత్ర తిరగరాసిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. ఈ ఇద్దరు గోల్డెన్ బోయ్స్ బుధవారం కలిశారు. తన గోల్డ్ మెడల్తో నీరజ్ చోప్రానే స్వయంగా బింద్రా ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ గోల్డ్ మెడల్స్ను పక్కపక్కనే ఉంచి వాటి చూస్తూ మురిసిపోయారు.
ఈ ఫొటోలనూ ఈ ఇద్దరు ఒలింపిక్స్ హీరోలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అంతేకాదు తన ఇంటికి వచ్చిన నీరజ్ చోప్రాకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్గా కూడా అభినవ్ బింద్రా ఇచ్చాడు. అది ఓ కుక్క పిల్ల. అంతేకాదు దీని పేరు టోక్యో కావడం విశేషం. అదే టోక్యో గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా తిరిగి ఇండియాకు వచ్చినప్పటి నుంచీ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. వరుస సన్మాన కార్యక్రమాలు, యాడ్స్ షూటింగ్ అంటూ బిజీబిజీగా ఉన్నాడు.