హైదరాబాద్: ఒలింపిక్స్ చరిత్రలో ఇండియా ఇవాళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నీరజ్ చోప్రా .. అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ( Track And Field ) ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఇవాళ జరిగిన ఫైనల్స్లో.. నీరజ్ చోప్రా తన జావెలిన్ త్రో ఈవెంట్లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. దీంతో అతనికి స్వర్ణ పతకం దక్కింది. అయితే ఇన్నేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో.. ఇండియన్ అథ్లెట్ ఎవ్వరూ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ గెలవలేదు. అయితే షూటర్ అభినవ్ బింద్రా మాత్రమే వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలిచాడు.
ఒలింపిక్స్ అంటేనే అథ్లెటిక్స్. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్యాటగిరీలో ఎన్నో ఈవెంట్లు ఉంటాయి. 100 మీటర్స్, 200, 400, 400 మీటర్స్తో పాటు డిస్కస్, స్టీపుల్ఛేజ్.. ఇలా చాల రకాల ఈవెంట్లు నిర్వహిస్తారు. అయితే ట్రాక్ అండ్ ఫీల్డ్లోనే జావెలిన్ త్రో కూడా ఉంటుంది. అద్భుతమైన రీతిలో టోక్యో గేమ్స్ కోసం ప్రిపేరైన నీరజ్.. తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించి.. ఇండియాకు గోల్డ్ మెడల్ను తీసుకువచ్చాడు. నీరజ్ ఫైనల్లో అత్యుత్తమంగా 87.58 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి .. చరిత్ర పుటల్లో నిలిచాడు.
దేశవ్యాప్తంగా సంబరాలు
నీరజ్ గోల్డ్ గెలవడంతో.. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఊరూవాడా అంతటా ఆ ఆనందంలో మునిగితేలుతున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు పసిడి పతకం వచ్చిందన్న సంతోషంలో ఊగిపోతున్నారు. కొందరు క్రీడా అభిమానులు ఏకంగా స్వీట్లు పంచేశారు. ఆఫీసుల్లోనూ ఉద్యోగులు ఒకర్ని ఒకరు విష్ చేసుకుంటూ ఆ థ్రిల్ను ఎంజాయ్ చేశారు.