న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలో బిట్ కాయిన్ ట్రేడింగ్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిఘాలో ఉంది. రూ.2,790 కోట్ల విలువైన లావాదేవీల నిర్వహణలో విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఎక్స్చేంజ్ యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది.
జన్మాయి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆధ్వర్యంలో 2017 డిసెంబర్లో వజిర్ఎక్స్ అనే క్రిప్టో కరెన్సీ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. ఇది దేశీయ క్రిప్టో కరెన్సీ స్టార్టప్గా దర్యాప్తులో తేలింది. దీనిపై దర్యాప్తు పూర్తయ్యాక ఎక్స్చేంజ్ డైరెక్టర్లు నిశ్చల్ సేథీ, హనుమాన్ మహాత్రే పేరిట ఈడీ నోటీసులు ఇచ్చింది.
చైనాకు చెందిన చట్ట విరుద్ధ ఆన్లైన్ బెట్టింగ్ యాప్తో హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. రూ.2,790.74 కోట్ల లావాదేవీలపై నోటీసు ఇచ్చామని తెలిపింది.
చైనీయులు రూ.57 కోట్ల డిపాజిట్లను క్రిప్టో కరెన్సీ టెథర్ (యూఎస్డీటీ)లోకి కన్వర్ట్ చేశారు. తర్వాత ఈ మొత్తాన్ని కేమాన్ ఐలాండ్స్లోని రిజిస్టర్ ఏజెన్సీ బినాన్స్ వాలెట్కు బదిలీ చేశారని ఈడీ అభియోగం.
వజీర్ ఎక్స్ను 2019లో బినాన్స్ స్వాధీనం చేసుకుంది. అయితే, వజీర్ ఎక్స్.. ఎక్స్చేంజ్ ద్వారా విస్త్రుత శ్రేణిలో లావదేవీలు జరిగాయని ఈడీ ఆరోపణ. యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్, కౌంటరింగ్ ది ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, ఫెమా గైడ్లైన్స్ను వజీర్ ఎక్స్ ఉల్లంఘించిందన్న అభియోగాలున్నాయి.