వరంగల్ : వరంగల్ నగరంలో 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలుత 5000 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పురుషుల 5000 మీ. పరుగు పందెంలో ఉత్తరప్రదేశ్కు చెందిన అభిషేక్ పాండే మొదటి స్థానంలో నిలవగా, మహిళల 5000 మీ. పరుగు పందెంలో యూపీకి చెందిన పారౌల్ చౌదరి మొదటి స్థానంలో నిలిచింది.
ఈ పోటీలు 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వరంగల్ వేదికగా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగడం ఇది రెండో సారి కావడం విశేషం. గతం (2020)లో క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీలకు వరంగల్ ఆతిథ్యమిచ్చింది. ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ విషయానికొస్తే 47 క్రీడా ఈవెంట్లలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 519 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్), నిట్ స్టేడియంలో కొనసాగుతున్నాయి.
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ నుంచి 17 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. వీరిలో యువ అథ్లెట్లు అగసర నందిని, జివాంజీ దీప్తి, హారికా దేవి ఉన్నారు. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో సత్తాచాటాలన్న పట్టుదలతో వీరంతా కనిపిస్తున్నారు. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణలో రాటుదేలుతున్న వీరంతా..జాతీయ టోర్నీలో రాణించడం ద్వారా మరోమారు తమ ప్రతిభను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు.