భారతీయ సినీ చరిత్రలో ఓ మహోజ్వల శకం ముగిసిపోయింది. ఐదు దశాబ్దాల పాటు అనన్యసామాన్య నటనవైదూష్యంతో సినీ సామ్రాజ్యాన్ని ఏలిన అభినయ చక్రవర్తి ఇక సెలవంటూ శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు. భారతీయ వెండితెరపై తొలి సూపర్స్టార్ దిలీప్కుమార్. రాశికన్నా వాసి ఘనం అన్న చందంగా యాభైఏళ్ల సినీ కెరీర్లో 65 సినిమాలు మాత్రమే చేసినా ఆయన అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. ఎక్కడా నాటకీయత కనిపించని సహజ అభినయం, చక్కటి సంభాషణ చాతుర్యం, తెరపై నిండైన మూర్తిమత్వం మేలికలయికగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. నవరసాల్ని నవనవోన్మేషితంగా పలికించి నటనానిఘంటువుగా కొనియాడబడ్డారు. నటుడిగా ఏదో ఒక ఛట్రంలో ఇమిడిపోకుండా రొమాంటిక్ డ్రామాల ద్వారా ట్రాజెడీ కింగ్గా మాస్ ఇతివృత్తాలతో సూపర్స్టార్గా అశేష అభిమానులకు చేరువయ్యారు. భారతీయ సినిమాను అత్యంత ప్రభావితం చేసిన తొలితరం కథానాయకుడిగా దిలీప్కుమార్ కీర్తి ఆచంద్రతారార్కం ప్రభావిస్తూనే ఉంటుంది. ఆయన అందించిన స్ఫూర్తి వెండితెరపై అభినయ కాంతులీనుతునే ఉంటుంది. గతకొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న దిలీప్కుమార్(98) బుధవారం ఉదయం ముంబయిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవటంతో బాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
పాకిస్థాన్లోని పెషావర్లో 1922 డిసెంబర్ 11న దిలీప్కుమార్ జన్మించారు. ఆయన అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ఖాన్. దిలీప్కుమార్ తండ్రి ఓ పండ్ల వ్యాపారి. వ్యాపారనిమిత్తం పాకిస్థాన్ నుంచి వారి కుటుంబం పూణెకు వలసవచ్చింది. బాంబే టాకీస్ అధినేత దేవికారాణి, ఆమె భర్త హిమాన్షురాయ్ తాము రూపొందించబోయే ‘జ్వార్ భట’ చిత్రంకోసం నూతన నటుల్ని అన్వేషిస్తున్న క్రమంలో దిలీప్కుమార్ వారి దృష్టిని ఆకర్షించారు. హీరో పాత్రకు కావాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉండడంతో దిలీప్కుమార్కు తమ సినిమాలో అవకాశమిచ్చారు. హీరోగా అతడి పేరు అందరికీ సులభంగా గుర్తుండేలా మొహమ్మద్ యూసుఫ్ఖాన్ను దిలీప్కుమార్గా రచయిత భగవతీ చరణ్వర్మ మార్చారు. తొలి సినిమా పరాజయం పాలై దిలీప్కుమార్కు నిరాశను మిగిల్చింది.
‘అందాజ్’తో తొలి విజయం
దిలీప్కుమార్ విజయపరంపరకు ‘అందాజ్’ చిత్రంతో బీజం పడింది. మెహబూబ్ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో విలక్షణ అభినయంతో మెప్పించారాయన. ఈ సినిమాతో ట్రాజెడీ కింగ్గా దిలీప్కుమార్పై ముద్ర పడింది.
‘దాగ్’తో మొదటి ఫిలింఫేర్
‘దాగ్’ చిత్రంలో దిలీప్కుమార్ భిన్న పార్శాలతో కూడిన పాత్రలో అత్యున్నత నటనను కనబరిచారు. పేదరికం కారణంగా ఇబ్బందులు పడే వ్యక్తిగా, తాగుబోతుగా వైవిధ్యతను ప్రదర్శిస్తూ ఆయన కనబరచిన నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. ‘దేవదాస్’ చిత్రంతో దేశవ్యాప్తంగా దిలీప్కుమార్ పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో అతడి నటనను ఫోర్బ్స్ పత్రిక కీర్తించింది. పార్వతి ప్రేమను పొందలేక మద్యానికి బానిసగా మారి జీవితాన్ని కోల్పోయిన అమర ప్రేమికుడు దేవదాస్గా కోట్లాది మంది సినీ అభిమానుల్ని అలరించారు. సంభాషణలతో కాకుండా కేవలం హావభావాలతో దేవదాస్ పాత్రను రక్తికట్టించారు. పునర్జన్మల నేపథ్యంలో అమలిన ప్రేమకథగా తెరకెక్కిన ‘మధుమతి’లో ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించారు.
‘ఆన్’తో కామెడీవైపు
ప్రేమకథా చిత్రాలకు పరిమితం కాకూడదనే ఆలోచనతో 1952లో రూపొందిన ‘ఆన్’తో తన పంథా మార్చుకున్నారు దిలీప్కుమార్. జానపద కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి ప్రేమికుడిగా హాస్యం, హీరోయిజం కలబోతగా కూడిన పాత్రలో నటించారు. 17 భాషల్లో 28 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం చరిత్రను సృష్టించింది. ‘మొఘల్ ఏ అజమ్’ దిలీప్కుమార్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. తాను ప్రేమించిన నాట్యకారిణి కోసం తండ్రిని ఎదురించిన మొఘల్ రాజకుమారుడిగా దిలీప్కుమార్ అసమాన నటనను కనబరిచారు. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా పదిహేను ఏళ్ల పాటు ఈ చిత్రం నిలిచింది. చారిత్రక ప్రేమకథా చిత్రాలకు స్ఫూర్తిగా ‘మొఘల్ ఏ అజమ్’ను చెబుతుంటారు.
‘గంగా జమున’తో నిర్మాతగా
అగ్రనటుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలోనే ‘గంగా జమున’ చిత్రంతో నిర్మాతగా మారారు దిలీప్కుమార్. తానే కథను రాసి హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు దిలీప్కుమార్. పరిస్థితుల ప్రభావం వల్ల దొంగగా మారిన గంగా అనే యువకుడిగా దిలీప్కుమార్ అజరామరమైన నటనను కనబరిచి ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచారు. తన ప్రభావం కోల్పోతున్నాడనే విమర్శకులకు ఈ సినిమాతో ధీటుగా బదులిచ్చారు. నిజజీవితంలో సోదరులైన దిలీప్కుమార్, నాసిర్ఖాన్ ఈ సినిమాలో అదే పాత్రల్లో కనిపించడం గమనార్హం.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు
1970 దశకంలోదిలీప్కుమార్ నటించిన కొన్ని సినిమాలు పరాజయాలుగా నిలిచాయి. దాంతో ఐదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారాయన. 1981లో ‘క్రాంతి’ సినిమాతో పునరాగమనం చేసిన దిలీప్కుమార్ విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ కెరీర్ను కొనసాగించారు. సెకండ్ ఇన్నింగ్స్లో శక్తి, విధాత, కర్మ, కానూన్ ఆప్నా ఆప్నా, సౌదాగర్ సినిమాలు ఆయనకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. 1998లో రూపొందిన ‘ఖిలా’ ఆయన నటించిన చివరి చిత్రం. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆయన వెండితెరపై కనిపించలేదు.
హాలీవుడ్ అవకాశాన్ని వదులుకున్నారు
‘మొఘల్ ఏ అజమ్’ చిత్రంలో దిలీప్కుమార్ అభినయానికి ముగ్ధుడైన బ్రిటన్ దర్శకుడు డేవిడ్ లీన్ తాను రూపొందించిన ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ చిత్రంలో కీలక పాత్ర కోసం దిలీప్కుమార్ను తీసుకోవాలని భావించారు. ఆ సినిమాలో నటించడానికి దిలీప్కుమార్ తిరస్కరించారు.ఆ తర్వాత అదే దర్శకుడు తాజ్మహల్ నేపథ్యంలో దిలీప్కుమార్, హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ జంటగా ఓ సినిమాను తెరకెక్కించాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సెట్స్పైకిరాలేదు.
అత్యధిక పురస్కారాలు అందుకున్న నటుడు
ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని మెప్పించిన దిలీప్కుమార్ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. అత్యధిక అవార్డులను అందుకున్న భారతీయ సినీ నటుడిగా ఖ్యాతి గడించారు. ‘దాగ్’ సినిమాతో తొలి ఫిలింఫేర్ పురస్కార విజేతగా దిలీప్కుమార్ నిలిచారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారాయన. ఈ పురస్కారాన్ని అత్యధికసార్లు అందుకున్న నటుడు దిలీప్కుమార్ కావడం గమనార్హం. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్, 1991లో పద్మభూషణ్, 1994లో దాదాసాహెబ్ఫాల్కే అవార్డులతో సత్కరించింది. అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ ఏ ఇంతియాజ్తో పాకిస్థాన్ ప్రభుత్వం దిలీప్కుమార్ను సత్కరించింది. ఈ అవార్డును అందుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో తిరిగి ఇచ్చేశారు.
నిజజీవితంలో విఫల ప్రేమాయణాలు
వెండితెరపై విఫల ప్రేమికుడిగా కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు దిలీప్కుమార్. సినిమాల్లో మాదిరిగానే నిజజీవితంలో ఆయన ప్రేమకథలు విషాదంగానే ముగియడం గమనార్హం. నదియా కే పార్, షబ్నం చిత్రాల్లో తనతో కలిసి నటించిన కామిని కౌషల్ను ప్రేమించారు దిలీప్కుమార్. పెద్దలు వీరి ప్రేమకు అభ్యంతరం తెలపడంతో కొద్ది రోజుల్లోనే ఈ జంట విడిపోయారు. ‘తరానా’ సినిమాలో కలిసి నటించిన సమయంలో మధుబాలతో దిలీప్కుమార్కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. దాదాపు ఏడేళ్ల పాటు కొనసాగిన ఈ ప్రేమబంధానికి మనస్పర్ధలతో ముగింపు పడింది. మధుబాల తండ్రి వీరి ప్రేమకు అభ్యంతరం తెలపడంతో దిలీప్కుమార్ ఆమెకు దూరమయ్యారు. వైజయంతీమాల, వహిదా రెహమాన్తో దిలీప్కుమార్ ప్రేమలో ఉన్నట్లు ఆ రోజుల్లో వార్తలొచ్చాయి. తనకంటే వయసులో ఇరవైరెండేళ్లు చిన్నదైన సైరాభానుని 1966లో ప్రేమించిపెళ్లాడారు. మధ్యలో అభిప్రాయభేదాలతో ఆమె కొన్నాళ్లు దూరమైన సమయంలో సామాజిక కార్యకర్త అస్మసాహిబాను వివాహం చేసుకున్నారు. కానీ రెండేళ్లకే ఈ పరిణయ బంధానికి ముగింపు పలికిన దిలీప్కుమార్ చివరి వరకు సైరాభానుతోనే కలిసి జీవించారు. దిలీప్కుమార్, సైరాభాను దంపతులకు పిల్లలు లేరు.
దర్శకత్వం కల నెరవేరలేదు
దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూసుకోవాలని అనుకున్న దిలీప్కుమార్ కల నెరవేరలేదు. దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘కళింగ’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు నిర్మాత సుధాకర్ ప్రకటించారు. చిత్రీకరణలో అనేక అవాంతరాలు తలెత్తడంతో సినిమాను పూర్తిచేయలేకపోయారు దిలీప్కుమార్.
మెథడ్ యాక్టింగ్పై..
తొలినాళ్లలో తన నటన పట్ల విమర్శలు రావడంతో మెథడ్ యాక్టింగ్పై దృష్టిపెట్టారు దిలీప్కుమార్. ఈ పద్ధతిని వెండితెరకు పరిచయం చేసిన తొలి నటుడిగా ఆయన నిలిచారు. ఓ సీన్ చేసే ముందు పలు మార్లు రిహార్సల్ చేస్తుండేవారు. నటన, హావభావాల విషయంలో సహజత్వం కనబరుస్తుండేవారు. ముఖ్యంగా విషాద ప్రేమకథల్లో దిలీప్కుమార్ జీవించేవారు. ఆ పాత్రల ప్రభావం నుంచి బయటపడటం కష్టమై ఒకనొకసమయంలో డిప్రెషన్కు గురయ్యారు. పాత్రలో సహజత్వం కోసం ఎంతటిప్రయాసకైనా సిద్ధపడేవారు. కోహినూర్ సినిమాలో ఓ పాట కోసం సితార్ నేర్చుకున్నారు.
మహానటుడుని కోల్పోయాం
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాలే అవార్డు గ్రహీత, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నటుడుగా దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి దిలీప్ కుమార్ చేసిన సుదీర్ఘ సాంస్కృతిక సేవను సీఎం గుర్తు చేసుకున్నారు. దిలీప్ కుమార్ మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సీఎం కేసీఆర్
దిలీప్కుమార్ మరణంతో సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భౌతికంగా దిలీప్కుమార్ దూరమైన అభిమానుల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన కీర్తి ఖండాంతరాలను దాటింది. తన నటనతో దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న గొప్ప నటుడు
-రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
దిలీప్కుమార్ మరణం సినీ లోకంతో పాటు సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు. భారతీయ సినీ పరిశ్రమలో లెజెండ్గా దిలీప్కుమార్ చిరస్థాయిగా గుర్తుండిపోతారు.
-ప్రధాని నరేంద్రమోదీ
వివిధ సినిమాలు, పాత్రల ద్వారా ఎన్నో తారల నటుల్లో స్ఫూర్తిని నింపిన దిగ్గజ నటుడు దిలీప్కుమార్. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాల్ని మిగిల్చివెళ్లిపోయారు. ఆయన మరణం బాధాకరం.
-మంత్రి కేటీఆర్
ఎప్పుడైనా భారతీయ సినిమా చరిత్రను గురించి చెప్పాల్సివస్తే దిలీప్కుమార్కు ముందు.. తర్వాత అని అభివర్ణించాల్సిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
-అమితాబ్బచ్చన్
భారతీయ సినీ చరిత్రలో ఒక శకం ముగిసింది.సినీ లెజెండ్ దిలీప్కుమార్ మరణం ఎంతో బాధాకరం. ఆయన ఒక సినీ సంస్థ, సినీ సంపద. దేశం గర్వించదగ్గ నటుడిగా దశాబ్దాల పాటు ఎంతో మందిని అలరించిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.
-చిరంజీవి
దిలీప్కుమార్ మరణంతో సినీ పరిశ్రమకు చెందిన ఓ శకం ముగిసిపోయింది. మా అందరిలో స్ఫూర్తి నింపిన గొప్ప హీరో ఆయన. దిలీప్కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
-అక్షయ్కుమార్