హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో జాతీయస్థాయి టోర్నీ ఆతిథ్యానికి సిద్ధమైంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 11వరకు 37వ జాతీయ హ్యాండ్బాల్ సబ్జూనియర్ చాంపియన్షిప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీకి రావాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ను జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సోమవారం సెక్రెటేరియట్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో ఒలింపిక్ అసోసియేషన్ క్రియాశీలకంగా పనిచేస్తూ క్రీడా సంఘాలను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా జగన్మోహన్రావు, వెంకటేశ్వర్రెడ్డి కోరారు. భవిష్యత్లో రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని జయేశ్ రంజన్ పేర్కొన్నారు.