హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతుండటంతో టీకాకు డిమాండ్ పెరుగుతున్నది. మొదట్లో వ్యాక్సిన్ వేసుకొనేందుకు ముందుకు రానివారు సైతం ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యసిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లకు దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తి కాగా, రెండోదశలో భాగంగా 45 ఏండ్లుదాటిన వారందరికీ టీకా వేస్తున్నారు. కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్కు భారత ప్రభుత్వం అనుమతించినప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా కొవిషీల్డ్ టీకానే పంపిణీచేస్తున్నారు. దీంతో కొందరు వ్యాక్సిన్ వేసుకొనేందుకు ముందుకు రాలేదు. మరికొందరు వ్యాక్సిన్ వేసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని నమ్మి వెనుకడుగువేశారు.
ఇంకో వర్గం ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వైరస్ సోకుతుందన్న తప్పుడు ప్రచారం నమ్మి ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఇన్నాళ్లూ వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగింది. మన రాష్ట్రంలోనూ ఆశించిన మేర ఆధరణ రాలేదని వైద్యారోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు టీకా ఆవశ్యకతపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఉచితంగా పంపిణీచేస్తున్న వ్యాక్సిన్ను అవకాశం ఉన్న ప్రాధాన్య వర్గాలవారు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా, ఉన్నతాధికారులు టీకా సురక్షితమని ప్రకటించారు. అయినప్పటికీ ఆశించినస్థాయిలో ప్రజలు ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను పరిమితి మేరకు నిర్వహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని, వ్యాక్సిన్ కోసం వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు.
డిమాండ్కు అనుగుణంగా పంపిణీ
కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి పెరగడం, పలు రాష్ర్టాల్లో లాక్డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. వైరస్ నుంచి రక్షణకు టీకా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి కేంద్రాల వైపు పరుగులు పెడుతున్నారు. ఏ వ్యాక్సిన్ మంచిది? ఏ సమయంలో తీసుకోవాలి? అంటూ తెలిసిన వైద్యులు, స్నేహితులను ఆరా తీస్తున్నారు. ఈ నెల 1 నుంచి 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా ఇస్తుండటం, వ్యాక్సిన్కు విపరీతంగా డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం అందుకు తగినట్టు ఏర్పాట్లుచేసింది. వ్యాక్సిన్ కేంద్రాలను మూడింతలు పెంచింది. ప్రైవేట్లోనూ పెద్దసంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు అనుమతిచ్చింది. వారంలో వీటి సంఖ్యను 2,200 వరకు పెంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. కొవిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారి కోసం కేంద్రాల వద్దే రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తున్నారు.
ప్రైవేట్లోనూ అదే జోరు
రాష్ట్రవ్యాప్తంగా 867 ప్రభుత్వ, 184 ప్రైవేట్ కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. ప్రైవేట్లో వ్యాక్సిన్ ధర రూ.150, సర్వీస్ చార్జీ రూ.100 తీసుకొంటున్నారు. వ్యాక్సిన్ సరఫరా, నిర్వహణ ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ చూస్తుండగా, పంపిణీ మాత్రం ప్రైవేట్వారు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రైవేట్ దవాఖానలకు టీకా కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. కార్పొరేట్ దవాఖానల్లో స్లాట్స్ ఖాళీ ఉండటం లేదని, వారం, పది రోజులపాటు ముందస్తు బుకింగ్ ఉన్నట్టు సమాచారం.
వ్యాక్సిన్ తీసుకుంటాం!
77% మంది సానుకూలం: లోకల్ సర్కిల్స్ సర్వే
కరోనా సెకండ్ వేవ్ భయం ప్రజలను వెంటాడుతున్నది. దీంతో వైరస్ నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్ బాట పట్టేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇదే విషయాన్ని దేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు కేవలం 38 శాతం మంది మాత్రమే టీకా తీసుకొనేందుకు సుముఖత వ్యక్తంచేయగా, ఇప్పుడు ఏకంగా 77 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్టు తెలిపింది. కేవలం 75 రోజుల్లో ఈ మార్పును గమనించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తుండటంతో లబ్ధిదారులు వ్యాక్సిన్ కేంద్రాలకు బారులు తీరుతున్నారని, కొద్ది రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంచేసింది.
ఇవీ కూడా చదవండి…
సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే