న్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. మహిళల విభాగంలో ప్రపంచ మూడో ర్యాం కర్ నవోమీ ఒసాక (జపాన్).. 73వ ర్యాంక్ క్రీడాకారిణి లైలా ఫెర్నాండెజ్ (కెనడా) చేతిలో ఖంగుతింటే.. పురుషుల సింగిల్స్లో మూడో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్).. 55వ ర్యాంకర్ గార్ఫియా (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఒసాక 7-5, 6-7 (2/7), 4-6తో 18 ఏండ్ల ఫెర్నాండెజ్ చేతిలో ఓడింది. మానసిక ఒత్తిడి కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్ నుంచి తప్పుకున్న ఒసాక.. చాలా రోజుల తర్వాత బరిలోకి దిగిన ఈ టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది.
పురుషుల సింగిల్స్లో ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన స్టెఫనోస్ సిట్సిపాస్ పోరు ముగిసింది. మూడో రౌండ్లో సిట్సిపాస్ 3-6, 6-4, 6-7 (2/7), 6-0, 6-7 (5/7)తో 18 ఏండ్ల అల్కరాజ్ గార్ఫియా చేతిలో ఓటమి పాలయ్యాడు. గత మ్యాచ్ల్లో టాయిలెట్ బ్రేక్స్తో వార్తల్లోకి ఎక్కిన సిట్సిపాస్.. కీలక పోరులో తుదికంటా పోరాడినా ఫలితం అతడికి ప్రతికూలంగా వచ్చింది. ఈ విజయంతో గార్ఫియా యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్కు చేరిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్ల్లో ష్వార్ట్మన్ (అర్జెంటీనా) 6-4, 6-3, 6-3తో మోల్కన్ (స్లొవేకియా)పై, మెద్వెదెవ్ (రష్యా) 6-0, 6-4, 6-3తో అండుజర్ (స్పెయిన్)పై విజయాలతో ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టారు. మహిళల విభాగంలో సిమోనా హలెప్ 7-6 (13/11), 4-6, 6-3తో రైబకినా (కజకిస్థాన్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6-4, 6-2 తో కసట్కినా (రష్యా)పై, కెర్బర్ (జర్మనీ) 5-7, 6-2, 6-3తో స్టెఫెన్స్ (అమెరికా)పై విజయాలు సాధించి ప్రిక్వార్టర్స్కు చేరారు. ముగురుజా (స్పెయిన్), క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), సబలెంక (బెలారస్) కూడా ముందడుగు వేశారు.
మిక్స్డ్ డబుల్స్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. శుక్రవారం రాత్రి జరిగిన పోరులో సానియా మీర్జా-రాజీవ్ రామ్ (అమెరికా) జంట 3-6, 6-3, 7-10తో డయానా (ఉక్రెయిన్)-మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. 61 నిమిషాల్లో ముగిసిన పోరులో తొలి సెట్లో ఓడిన సానియా జంట.. ఆ వెంటనే పుంజుకొని రెండో సెట్ చేజిక్కించుకుంది. హోరాహోరీగా సాగిన మూడో సెట్లో ఆకట్టుకోలేకపోయింది.