అహ్మదాబాద్: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో గుజరాత్ సర్కారు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నాలుగు మెట్రో నగరాలైన అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్లో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. దాంతో ఈ రోజు నుంచి మార్చి 31 వరకు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆ నాలుగు మెట్రో నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.
తాజాగా అహ్మదాబాద్ నగరపాలక సంస్థ కూడా కరోనా కట్టడి కోసం నగరంలోని పార్కులు, గార్డెన్లను మూసివేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అహ్మదాబాద్లోని పార్కులు, గార్డెన్లు మూసే ఉంటాయని తెలిపింది. పార్కులు, గార్డెన్లతోపాటు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన కంకారియా సరస్సు, జంతుప్రదర్శనశాలను కూడా మూసివేయనున్నట్లు వెల్లడించింది.