హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వ్యూహాన్ని పోలీసులు పక్కాగా అమలుచేస్తున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటలవరకు నిషేధాజ్ఞలను అందరూ పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పౌరులపట్ల దురుసుగా ప్రవర్తించకుండా, వారికి ఆంక్షలపై అవగాహన కల్పించాలన్న డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కర్ఫ్యూ తొలిరోజైన మంగళవారం రాత్రి అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల హెడ్క్వార్టర్స్, పట్టణాల్లోనూ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు సైతం రోడ్లపైకి వచ్చి కర్ఫ్యూను సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి బుధవారం వరకు మాస్క్లేకుండా బయట తిరిగిన వారికి 1,10,850 చలాన్లు విధించినట్టు ఉన్నతాధికారులు వివరించారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 36,659 మందిపై కేసులు నమోదుచేశారు.